అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోన్నాయి. లోకల్ టీమ్ గుజరాత్ టైటాన్స్- వరుసగా రెండో సీజన్లో కూడా ఫైనల్లో అడుగు పెట్టింది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం- ఈ మ్యాచ్కు వేదిక.
శుక్రవారం రాత్రి ఇదే స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ను మట్టికరిపించింది. 62 పరుగుల తేడాతో రోహిత్ సేను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్- నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ దీన్ని అందుకోలేకపోయింది. 18.2 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ అయింది.

వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ పరుగుల వరదను పారించాడు. 86 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 129 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మూడు సెంచరీలను తన పేరు మీద లిఖించుకున్నాడు. సాయి సుదర్శన్- 43, హార్దిక్ పాండ్యా- 28, వృద్ధిమాన్ సాహా- 18 పరుగులు చేశారు.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్లో ముగ్గురు బ్యాటర్లు మినహా మిగిలిన వారెవరూ కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్-61, తిలక్ వర్మ-43, కామెరాన్ గ్రీన్-30 పరుగులు చేశారు. రోహిత్ శర్మ సహా మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ అయిదు వికెట్లతో సత్తా చాటాడు. 2.2 ఓవర్లల్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను నేల కూల్చాడు.
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్లో అడుగు పెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్తో మరోసారి తలపడటానికి సంసిద్ధమైంది. ఈ రెండు జట్లు ఇప్పటికే రెండుసార్లు ఎదురుపడ్డాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అయిదు వికెట్ల తేడాతో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. గుజరాత్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 182 పరుగులు చేసింది.
మళ్లీ ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్లో తారసపడ్డాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ రిజల్ట్ రివర్స్ అయింది. ఈ సారి గుజరాత్ టైటాన్స్పై ధోనీ సేన తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 172 పరుగులు చేయగా.. హార్దిక్ టీమ్ దాన్ని ఛేదించలేకపోయింది 157 పరుగులే చేయగలిగింది. ఇప్పుడిక ముచ్చటగా మూడోసారి ఫైనల్స్లో కూడా ఈ రెండు జట్లే పోరాడబోతోండటం ఆసక్తి రేపుతోంది.