ఈ ఐపీఎల్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఏం బాగలేదు. ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచుల్లోనే విజయాలు సాధించింది. దీంతో పాయిట్ల పట్టికలో కేవలం 9వ స్థానంలో నిలిచింది. మంచి బ్యాటింగ్ లైనప్, అదిరిపోయే బౌలర్లు ఉన్నా కూడా సన్రైజర్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. జట్టులో కీలక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు.
ఈ గాయం చిన్నదేమీ కాదట. దీంతో అతను మిగతా ఐపీఎల్ 2023 మ్యాచులన్నింటికీ దూరమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సన్రైజర్స్ యాజమాన్యం కూడా వెల్లడించింది. ఇప్పటి వరకు సన్రైజర్స్ ఆడిన మ్యాచుల్లో కూడా వాషింగ్టన్ సుందర్ పెద్దగా రాణించలేదు. తొలి ఆరు మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అయితే గత మ్యాచులో మాత్రం రాణించాడు.

మూడు వికెట్లు తీసుకోవడంతోపాటు కొన్ని విలువైన పరుగులు చేశాడు. కానీ సన్రైజర్స్ మాత్రం ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అయినా కూడా కనీసం ఇప్పుడైనా సుందర్ ఫామ్ అందుకున్నాడని ఫ్యాన్స్ సంతోషించారు. ఆ ఆనందం ఒక్క మ్యాచ్కే పరిమితమైంది. తర్వాతి మ్యాచ్ కూడా ఆడకుండానే ఐపీఎల్కు దూరమయ్యాడీ ఆల్రౌండర్. ఇది తెలిసిన వాళ్లు అతనిపై మండిపడుతున్నారు.
గతంలో కూడా వాషింగ్టన్ సుందర్ సులభంగా గాయాలపాలయ్యాడు. దీని వల్లనే అతని అంతర్జాతీయ కెరీర్ కూడా దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్న అభిమానులు.. 'తనేమైనా గాజు బొమ్మలాంటి వాడా? ఇప్పుడు ఎన్సీయే జోకర్లు వచ్చి.. అతన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం అంటారు చూడు' అంటూ ఎన్సీయేపై కూడా జోకులు పేలుస్తున్నారు.
ప్రొఫెషనల్ క్రికెటర్లు మరీ ఇంతలా ఎలా గాయపడతారు? అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరేమో 'గాయాలు లేకుండా వరుసగా ఏడు మ్యాచులు ఆడాడు వాషీ.. అదే గొప్ప రికార్డు' అంటూ ఎగతాళి చేస్తున్నారు. వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ ఇద్దరూ కూడా ఎన్సీయేలో సభ్యులంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనా అతను త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.