కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో గాయపడిన సంగతి తెలిసిందే. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. సీజన్ ఓపెనర్లో బరిలో దిగిన అతను.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై మంచి స్కోరు చేసింది.
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) అద్భుతంగా ఆడాడు. అతను కొట్టిన ఒక భారీ సిక్సర్ను ఆపేందుకు బౌండరీ లైన్ వద్ద ఉన్న కేన్ విలియమ్సన్ ప్రయత్నించాడు. గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్ చేశాడు. కానీ బౌండరీ లైన్ ఆవల ల్యాండ్ అయ్యేప్పుడు కంట్రోల్ కోల్పోయాడు. దీంతో అతని కుడి కాలు బాగా దెబ్బతింది. నొప్పితో విలవిల్లాడిన అతన్ని గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఫిజియోలు పరిశీలించారు.

అతను గాయం తీవ్రమైంది కావడంతో రెండు వైపులా పట్టుకొని అతన్ని మైదానంలో నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ మ్యాచ్లో విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేశాడు. స్కానింగ్కు వెళ్లిన విలియమ్సన్ గాయం చాలా తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైనట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. అతని స్థానంలో రిప్లేస్మెంట్గా ఎవరి పేరును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో న్యూజిల్యాండ్ వెళ్లిపోయిన కేన్ విలియమ్సన్.. ఆక్లాండ్ విమానాశ్రయంలో క్లచెస్ సాయంతో నడుస్తూ కనిపించాడు.
కుడి కాలు కనీసం నేలపై ఆనించలేకపోతున్న అతన్ని కొందరు మీడియా ప్రతనిధులు పలకరించారు. 'ఇప్పుడు అంత నొప్పిగా లేదు' అని కేన్ మామ వాళ్లకు సమాధానం చెప్పాడు. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విలియమ్సన్కు ఇలా గాయం అవడం కివీస్కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అభిమానులు కూడా విలియమ్సన్ను ఇలా చూడలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.