కొంత కాలంగా తన ఎగ్రెసివ్ యాటిడ్యూడ్తో అందరి దృష్టిలో పడిన కుర్ర బ్యాటర్ రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్ జట్టులో మంచి ఫినిషర్గా మారతాడని అనుకున్న ఈ అస్సాం కుర్రాడు బ్యాటుతో పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా గతేడాది ఆర్సీబీ స్టార్ పేసర్, టీమిండియా ప్లేయర్ హర్షల్ పటేల్తో కూడా పరాగ్ గొడవ పడ్డాడు. సిరాజ్తో కూడా వాగ్వాదానికి దిగాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత పరాగ్పై అందరి ఫోకస్ మరింత పెరిగింది. ఇలా గొడవ పడ్డాడంటే తనకంటూ మంచి ట్యాలెంట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పరాగ్ పెద్దగా రాణించలేదు. గతేడాది ఐపీఎల్ మొత్తంలో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత దేశవాళీల్లో కొన్ని మ్యాచుల్లో అస్సాంను ఒంటి చేత్తో గెలిపించాడు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్లో రాజస్థాన్ జట్టులో కూడా రాణిస్తాడని ఆ టీం ఫ్యాన్స్ అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. పరాగ్ ఏమాత్రం రాణించలేదు. తనకు బాగా కలిసొచ్చిన నాలుగో నెంబర్ స్థానంలో ఆడించినా పరాగ్ విఫలమయ్యాడు. ఈ సీజన్లో ఐదు మ్యాచులు ఆడిన అతను 112.50 స్ట్రైక్ రేటుతో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ ఆడిన మ్యాచుల్లో పరాగ్ను పక్కన పెట్టారు.
ఈ క్రమంలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్న పరాగ్.. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'కష్టాలు ఎక్కువైనప్పుడు.. బలంగా ఉన్న వాళ్లు వెనకడుగు వేయరు' అని అర్థం వచ్చే ఇంగ్లిష్ కొటేషన్ను తన వీడియోకు జత చేశాడు. ఈ వీడియోలో పరాగ్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవకముందు పరాగ్ ఒక ట్వీట్ చేశాడు. తను ఈ సీజన్లో ఏదో ఒక మ్యాచ్లో ఒకే ఓవర్లో 4 సిక్సర్ల బాదుతానని ప్రకటించాడు. ఇప్పుడు ఇంతలా ఫెయిలవుతున్నాడు. దీంతో నెటిజన్లు పరాగ్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. 'నీ కన్నా యూజ్లెస్, షేమ్లెస్ మనిషిని జీవితంలో చూడలేదు' అని కొందరు డైరెక్ట్గా తిట్టేస్తున్నారు. మరికొందరేమో ఆ నాలుగు సిక్సర్ల సంగతి ఏమైంది? అంటూ ఎగతాళి చేస్తున్నారు.
మైదానంలో మరీ ఎక్కువ యాటిడ్యూడ్ చూపించే పరాగ్.. బ్యాటింగ్లో మాత్రం ట్యాలెంట్ లేదని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ ఎగ్రెషన్ చూపించే పరాగ్.. ట్యాలెంట్ మాత్రం పరమ చెత్తగా ఉందని చాలా మంది ఎగతాళి కూడా చేశారు. ఇప్పుడు పరాగ్ ఫామ్ కోల్పోవడం కూడా వాళ్లకు ఆయుధంగా మారింది.