న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023లో ఢిల్లీ కేపిటల్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. శనివారం రాత్రి మొహాలీలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. నిన్నటివరకు విజయాల కోసం మొఖం వాచిన ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్ను తన ఖాతాలో వేసుకోగలిగింది. పాయింట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. భారీ లక్ష్యాన్ని సైతం ఢిల్లీ బ్యాటర్లు అలవోకగా ఛేదించడం ఈ మ్యాచ్ ప్రత్యేకత.
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ- ఈ స్కోర్ను అవలీలగా కొట్టేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. 16.4 ఓవర్లలోనే 187 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్కు చేరే ఆశలను సజీవంగానే ఉంచుకొన్నప్పటికీ- అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇకపై ఆడబోయే అన్ని గేమ్లలోనూ భారీ తేడాతో నెగ్గితేనే ప్లేఆఫ్స్ చేరొచ్చు.

ఆర్సీబీ బ్యాటింగ్ బ్యాక్బోన్ విరాట్ కోహ్లీ తన దూకుడును కంటిన్యూ చేస్తోన్నాడు. ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ బాదాడు. 46 బంతుల్లో అయిదు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్-45, మహిపాల్ లోమ్రార్-54 సత్తా చాటారు. ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్లో మిఛెల్ మార్ష్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. కేప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ను త్వరగానే కోల్పోయినప్పటికీ దాని ప్రభావం మిగిలిన బ్యాటర్లపై పడలేదు. బౌలర్లపై ఫిల్ సాల్ట్ విరుచుకుపడ్డాడు. 45 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 87 పరుగులు చేవాడు. రీలీ రొస్సౌ-35 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ- ఢిల్లీ కేపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ హాఫ్లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన మ్యాచ్లో వారిద్దరూ చేతులు కలుపుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని విషయం తెలిసిందే. కనీసం ముఖాలు కూడా చూసుకోలేదు. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఛైర్మన్గా పని చేస్తోన్నప్పుడే టీమిండియా కేప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్న విషయం తెలిసిందే.
అప్పటి వివాదాలను దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీ- సౌరవ్ గంగూలీ ఎడమొకం పెడమొకంగా కనిపించారప్పట్లో. శనివారం రాత్రి నాటి మ్యాచ్లో మాత్రం ఈగోలను పక్కన పెట్టారు. పరస్పరం ఆత్మీయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మ్యాచ్లో గెలిచినందుకు కోహ్లీ.. గంగూలీకి అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.