న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023లో ఢిల్లీ కేపిటల్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. శనివారం రాత్రి మొహాలీలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. విజయాల కోసం మొఖం వాచిన ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్ను తన ఖాతాలో వేసుకోగలిగింది. పాయింట్ల సంఖ్యను కూడా పెంచుకుంది. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లల్లో నాలుగింట్లో విజయాలను అందుకుంది. తొలి అయిదు మ్యాచ్లల్లో ఘోరంగా ఓడిపోయింది ఢిల్లీ. ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఆ తరువాత జూలు విదిలించింది. చివరి అయిదు మ్యాచ్లల్లో నాలుగింట్లో గెలిచింది. ఓడింది ఒక్కటే. 10వ తేదీన తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది ఢిల్లీ కేపిటల్స్. బలమైన చెన్నై సూపర్ కింగ్స్ను తలపడబోతోంది.

మొహాలీలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ- ఈ స్కోర్ను అవలీలగా కొట్టేసింది. 16.4 ఓవర్లలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 187 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్కు చేరే ఆశలను సజీవంగానే ఉంచుకొన్నప్పటికీ- అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇకపై ఆడబోయే అన్ని గేమ్లలోనూ భారీ తేడాతో నెగ్గితేనే ప్లేఆఫ్స్ చేరొచ్చు.
ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ ప్రవర్తన అభిమానుల్లో అసహనానికి దారి తీసింది. ఢిల్లీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, డేవిడ్ వార్నర్తో వాగ్యుద్ధానికి దిగడాన్ని ఫ్యాన్స్ ఎవరూ స్వాగతించట్లేదు. అతన్ని భారీగా ట్రోల్ చేస్తోన్నారు. తెలుగు అభిమానులు కూడా అతనిపై ట్రోల్స్ను పోస్ట్ చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో సిరాజ్- ఫిల్ సాల్ట్, డేవిడ్ వార్నర్తో గొడవపడ్డాడు.
ఇది సిరాజ్ను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఫిల్ సాల్ట్తో గొడవ పెట్టుకున్నాడు. వారిద్దరినీ వారించడానికి వచ్చిన కేప్టెన్ డేవిడ్ వార్నర్ను కూడా మందలించాడు. వేలెత్తి చూపుతూ ఏదో మాట్లాడాడు. అతను చెప్పిన దానికి ఒకదశలో డేవిడ్ వార్నర్ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. గొడవ వద్దంటూ వార్నర్.. తన కో ఓపెనర్ ఫిల్ సాల్ట్ను వెనక్కి పంపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం సాల్ట్ను హగ్ చేసుకుని, దీనికి ముగింపు పలికాడు సిరాజ్.