ఢిల్లీ: ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్ ఇవ్వాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇది 50వ మ్యాచ్. అలాగే ఢిల్లీకి లైఫ్ అండ్ డెత్ గేమ్ కూడా. గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఓడితే మాత్రం ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయినట్టే.
వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఈ జట్టు- తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆర్సీబీతో సహా అన్ని మ్యాచ్లనూ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లను ఆడిన డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్- గెలిచింది మూడింట్లోనే. తొమ్మిది మ్యాచ్లల్లో ఘోర పరాజయాలను చవి చూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ప్లేఆఫ్స్ కోసం సర్వశక్తులను ఒడ్డాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ కేపిటల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ ఎన్రిచ్ నోర్ట్జె జట్టును వీడాడు. తన స్వదేశం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్కు కూడా అతను అందుబాటులో ఉండట్లేదు. అత్యవసర వ్యక్తిగత కారణాలతో నోర్ట్జె స్వదేశానికి వెళ్లనున్నాడని ఢిల్లీ కేపిటల్స్ మేనేజ్మెంట్ తెలిపింది.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లను ఆడాడు ఎన్రిచ్ నోర్ట్జె. ఏడు వికెట్లను పడగొట్టాడు. 2/20 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 8.24 ఎకానమిని రికార్డ్ చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో 50 వికెట్లను పడగొట్టాడు. 38 మ్యాచ్లల్లో అతను ఈ ఘనతను సాధించాడు. 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ మొత్తానికీ ఇది అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.
నోర్ట్జె స్థానంలో ఎవరినీ రీప్లేస్ చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ కేపిటల్స్ మేనేజ్మెంట్ తెలిపింది. ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ కోసం అందుబాటులో ఉన్న వనరులనే వినియోగించుకుంటామని పేర్కొంది. దీని తరువాత నోర్ట్జె స్థానాన్ని భర్తీ చేస్తామని తెలిపింది. కుటుంబపరమైన అత్యవసర కారణాలతో అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదని, ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని వివరించింది.