న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ కేపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. దీనికి ఎక్కడే గానీ బ్రేకులు పడట్లేదు. నాలుగు మ్యాచ్లు ఆడినప్పటికీ ఇంకా బోణీ కొట్టనే లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లోనూ అపజయాలను చవి చూసింది. అపఖ్యాతాని మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిందీ జట్టు. శనివారం తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది.
మంగళవారం రాత్రి సొంతగడ్డపై ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది వార్నర్ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 19.4 ఓవర్లల్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 45 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేశాడు.

ఢిల్లీ కేపిటల్స్లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. కేప్టెన్ డేవిడ్ వార్నర్-51, అక్షర్ పటేల్-54, మనీష్ పాండే-26 పరుగులు చేశారు. పృథ్వీ షా-15 సహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. యష్ ధుల్-2, రౌమన్ పావెల్-4, లలిత్ యాదవ్-2, అభిషేక్ పోరెల్-1, కుల్దీప్ యాదవ్-0, ఎన్రిచ్ నోర్ట్జే-5 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్లో సూర్యకుమార్ యాదవ్ మినహా క్రీజ్లోకి దిగిన బ్యాటర్లందరూ ధాటిగా ఆడారు.. జట్టుకు విజయాన్ని అందించారు.
సూర్యకుమార్ యాదవ్ది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన షార్ట్ బాల్ను భారీ షాట్ ఆడాడు సూర్య. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి నేరుగా వెళ్లి బౌండరీ లైన్ వద్ద కుల్దీప్ యాదవ్ చేతుల్లో వాలింది. అతని ఖాతాలో ఇది మరో గోల్డెన్ డక్. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో వన్డే ఇంటర్నేషనల్స్లో కూడా వరుసగా మూడు మ్యాచ్లల్లో సూర్యకుమార్ యాదవ్ సున్నాకే అవుట్ అయ్యాడు.
అదే చెత్త ప్రదర్శన ఐపీఎల్లోనూ కంటిన్యూ చేస్తోన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 15, చెన్నై సూపర్ కింగ్స్పై ఒక పరుగు చేశాడు. ఇప్పుడు మళ్లీ డకౌట్ అయ్యాడు. ఈ పరిణామాలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమౌతోన్నాయి. సూర్యకుమార్ యాదవ్పై నిప్పులు చెరుగుతున్నారు ఫ్యాన్స్. మిస్టర్ 360 డిగ్రీస్గా అభివర్ణించిన అభిమానులే ఇప్పుడతన్ని శూన్యకుమార్ యాదవ్గా, సున్నాకుమార్ యాదవ్గా నిక్ నేమ్స్ పెడుతున్నారు.