ఐపీఎల్లో ఐదో టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ తాజా ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై అద్భుత విజయంతో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తను మరో ఐపీఎల్ సీజన్ ఆడతానని ధోనీ ప్రకటించాడు.
ఈ క్రమంలో త్వరలోనే తన మోకాలికి చికిత్స చేయింకునేందుకు ధోనీ ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం ముంబైలోని ప్రముఖ ఆస్పత్రి కోకిలాబెన్ హాస్పిటల్లో కొన్ని చెకప్లు చేయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా ధ్రువీకరించారు.

ధోనీకి పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ అవసరం అనుకుంటే అది కూడా చేస్తారని, అయితే ఆపరేషన్ చేయించుకోవాలా? వద్దా? అనే నిర్ణయం మాత్రం ధోనీకే వదిలేశామని విశ్వనాధ్ తెలిపారు. ఇలాంటి సమయంలో కారులో వెళ్తున్న ధోనీ చేతిలో భగవద్గీతతో కనిపించాడు. ఇలా భగవద్గీతతో ఉన్న ధోనీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ధోనీ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూనే వచ్చాడు. చెపాక్లో జరిగిన చెన్నై చివరి లీగ్ మ్యాచ్లో కూడా మోాకాలికి నీక్యాప్ పెట్టుకొని కనిపించాడు. ఇది చూసిన చాలా మంది ధోనీ గాయం మరీ తీవ్రమైందా? అని ఆందోళన చెందారు. ఈ 41 ఏళ్ల స్టార్ క్రికెటర్ వచ్చే ఐపీఎల్ కూడా ఆడతానని ప్రకటించడంతో ఇప్పటి నుంచి దానికి రెడీ అవుతున్నట్లు అనిపిస్తోంది. దీని కోసమే ముందుగా తన మోకాలిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఒకవేళ ధోనీ మోకాలికి శస్త్రచికిత్స తప్పదు అనుకుంటే.. అది కూడా కోకిలాబెన్ ఆస్పత్రిలోనే జరుగుతుంది. దాదాపు స్టార్ క్రికెటర్లు అందరూ భారత్లో అయితే ఇక్కడే ఆపరేషన్లు చేయించుకుంటారు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్కు కూడా ఇక్కడే చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.