ఐపీఎల్ ఫైనల్లో మరోసారి చెన్నై జయకేతనం ఎగురవేసింది. వర్షం కారణంగా కుదించిన మ్యాచులో చివరి బంతికి ఘనవిజయం సాధించి, ఐదో టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. జట్టులో ఉన్న కుర్ర ప్లేయర్లను ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ మర్చిపోని ప్లేయర్ ధోనీ. ఈ విజయం తర్వాత కూడా కుర్రాళ్లకు కొన్ని కీలక సూచనలు చేశాడీ లెజెండ్.
ఇదే విషయాన్ని చెన్నై టీంలోని కుర్ర ప్లేయర్లు శివమ్ దూబే, తుషార్ దేశ్పాండే వెల్లడించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత తమతో ధోనీ ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఏడాది చెన్నై జట్టు మిడిలార్డర్కు వెన్నెముకలా మారిన శివమ్ దూబే ఈ మ్యాచ్లో కూడా 32 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.

'నాకు మహీ భాయ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. నా పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పాడు. చాలా సింపుల్గా నేనేం చేయాలో వివరించాడు. నువ్వు క్రీజులోకి వెళ్తే.. టీం రన్ రేట్ పెంచాల్సి ఉంటుంది అంతే. ఈ క్రమంలో త్వరగా అవుటైనా పర్లేదు. కానీ ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అదే ధోనీ నాకు ఇచ్చిన బ్రీఫింగ్. ఇంత కన్నా క్లియర్గా ఉన్నాడీ స్టార్.
ఈ ఏడాది చెన్నైకు బంతితో మంచి ఆరంభాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన తుషార్ దేశ్పాండే కూడా ధోనీ తనతో ఏం చెప్పాడో వెల్లడించాడు. 'నేను ఒకసారి సరిగా బౌలింగ్ చేయలేదు. అప్పుడు ధోనీ నా దగ్గరకు వచ్చి ఇంపాక్ట్ రూల్ గురించి చెప్పాడు. దీని వల్ల 200 స్కోరు అంటే అసలు మ్యాటరే కాదని, జట్టులో స్థానం పోతుందని భయపడాల్సిన అవసరమే లేదని చెప్పాడు. ఒక యంగ్ ప్లేయర్కు ఇంతకన్నా ఇంక ఏం కావాలి?' అని దేశ్పాండే ప్రశ్నించాడు.
అలాగే అందరూ కలిసి టైటిల్ నెగ్గిన తర్వాత ధోనీ ఏమన్నాడో కూడా దేశ్పాండే వెల్లడించాడు. 'అందరి కష్టం ఫలితం ఇది. అయితే ఈ ఏడాది మనం చేసిన తప్పులు, ఒప్పులు గుర్తుంచుకోండి. ఈ సీజన్లో మీరు ఏం నేర్చుకున్నారు? వచ్చే సీజన్లలో ఏం చేయాలి? ఇది మాత్రం కచ్చితంగా ఆలోచించండి' అని ధోనీ చెప్పాడని దేశ్పాండే వెల్లడించాడు.