చెన్నై: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా రెండేసి చొప్పున విజయాలతో సమవుజ్జీగా నిలిచాయి. నెట్ రన్రేట్ ఆధారంగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే అయిదో స్థానంలో కొనసాగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్కు ఇది 200 మ్యాచ్. ధోనీ సారథ్యంలో తన ల్యాండ్ మార్క్ మ్యాచ్ను ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ధోనీ కేప్టెన్సీలో సీఎస్కే.. తిరుగులేని జట్టుగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఇదే. ముంబై ఇండియన్స్ తరువాత అత్యధికంగా ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఖాతాలో అయిదు టైటిల్స్ ఉన్నాయి.

ధోనీ కేప్టెన్సీలో ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్కు చేరింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్స్ గెలుచుకుంది. అయిదు సార్లు ఫైనల్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్ను ఎగరేసుకెళ్లిందీ ఎల్లో ఆర్మీ. 2016, 2017 సీజన్ల నుంచి తప్పుకొంది. 2000, 2022 సీజన్లల్లో అత్యంత అధ్వాన్న ఆటతీరును ప్రదర్శించింది చెన్నై సూపర్ కింగ్స్. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. అవమానకరమైన ఓటములను చవి చూసింది.
ఈ సారి ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి ఫర్వాలేదనిపించే స్థాయిలోనే కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో రెండింట్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది గానీ.. ఆ తరువాత పుంజుకొంది. ఓటమి భారం నుంచి త్వరగా కోలుకుంది. రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది.