ముంబై: ఐపీఎల్ 2023లో మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం సాయంత్రం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అపజయాలు ముంబై ఇండియన్స్ కొత్తేమీ కాకపోయిన్పటికీ ఓడిన విధానం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. చెన్నైపై మ్యాచ్లో ఇద్దరు, ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. నెహాల్ వధేరా 64 పరుగులతో రాణించాడు.
ఆ స్థాయిలో మరే బ్యాటర్ కూడా భారీగా పరుగులు చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్-26, ట్రిస్టన్ స్టబ్స్-20 పరుగులు చేశారంతే. కేప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ ఫిగర్ను కూడా అందుకోలేకపోయారు. బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. కనీసం బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయినా రాణిస్తుందనుకుంటే- అదీ అంతంతమాత్రమే. ముంబై నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే కొట్టేశారు చెన్నై బ్యాటర్లు.

ముంబై ఇండియన్స్ సాధించిన ఈ ఓటమి ప్రత్యేకించి- కేప్టెన్ రోహిత్ శర్మను తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. బ్యాటర్గా రోహిత్ శర్మ మరోసారి డకౌట్ కావడం దీనికి ఒక కారణమైతే.. జట్టును కనీసం విజయం వైపయినా నడిపించడంలో విఫలం అయ్యాడంటూ మండిపడుతున్నారు అభిమానులు. ఓపెనర్గా విఫలమౌతోన్న నేపథ్యంలో వన్ డౌన్గా బ్యాటింగ్కు దిగినప్పటికీ క్రీజ్లో నిలదొక్కుకోలేకపోయాడు రోహిత్.
మూడే మూడు బంతులను ఎదుర్కొన్నాడు. మళ్లీ డకౌట్ అయ్యాడు. మిడిల్ అండ్ హాఫ్ స్టంప్ మీద దీపక్ చాహర్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని షాట్ ఆడబోయాడు రోహిత్. బ్యాట్ను కాస్త ఎర్లీగా ఝుళిపించాడు. బ్యాట్ పైఅంచులకు తాకిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని అలవోకగా అందుకోగలిగాడు రవీంద్ర జడేజా. క్రీజ్లో కుదురుకోవాల్సిన దశలో అతను ఆ షాట్ ఆడటం ఫ్యాన్స్ను కలవరపాటుకు గురిచేసింది.
ఈ పరిణామాలు అభిమానులతో పాటు మాజీ అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తోన్నాయి. వచ్చే నెలలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలని కోరుకుంటోన్నారు ఫ్యాన్స్. లండన్ ఓవల్ స్టేడియంలో ఈ ఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోతోంది టీమిండియా. ఈ మ్యాచ్ నాటికి రోహిత్ ఖచ్చితంగా ఫామ్ను అందుకోవాల్సి ఉంటుంది.

రోహిత్ శర్మ ఫామ్పై టీమిండియా మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ శర్మకు మరోసారి సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్పై అతను అవుట్ అయిన తీరు ఆందోళనకరమని వ్యాఖ్యానించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ తనను తాను ఫిట్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని, శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని అతను బయటపడాల్సి ఉందని అన్నారు.
ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల నుంచి బ్రేక్ తీసుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను ఆడాల్సి ఉందని, ఈ మ్యాచ్ కోసం తనను తాను సన్నద్ధం చేసుకోవడానికి, ఫిట్గా ఉంచుకోవడానికి రోహిత్కు బ్రేక్ తప్పదని వ్యాఖ్యానించాడు. అతని వైఫల్యం ప్రభావం డబ్ల్యూటీసీ ఫైనల్పై పడకూడదని కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించాడు.