చెన్నై: ఐపీఎల్ 2023లో భాగంగా ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొలి రౌండ్లో పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది రోహిత్ సేన. ఇప్పుడీ ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావిస్తోంది.
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తోన్న ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఢీ కొట్టబోతోన్న నేపథ్యంలో ఈ మ్యాచ్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వర్షం వల్ల లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ను పక్కనపెడిత ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్లల్లో అయిదు విజయాలను సాధించింది. మొత్తం 11 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

తాను సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్లో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా నిలిచిన ఎంఎస్ ధోనీకి- మున్ముందు మరిన్ని కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు లేకపోలేదు. అతణ్ని టీమిండియా హెడ్ కోచ్గా నియమించే అవకాశాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ పరిశీలిస్తోందనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అయిన తరువాత ధోనీకి ఈ బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదు.
ఇదే విషయాన్ని తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ధృవీకరించారు. టీమిండియా హెడ్ కోచ్గా ధోనీని నియమించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చని చెప్పారు. ధోనీకి హెడ్ కోచ్ బాధ్యతలను బీసీసీఐ అప్పగిస్తుందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని తేల్చి చెప్పారు.
పూర్తిస్థాయిలో క్రికెట్ నుంచి తప్పుకొన్న తరువాత ధోనీకి బీసీసీఐలో కీలకమైన అసైన్మెంట్ దక్కుతుందని సునీల్ గవాస్కర్ చెప్పారు. ఆ అసైన్మెంట్- సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కావొచ్చు, టీమ్కు హెడ్ కోచ్ కావొచ్చు, లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్ కావొచ్చని వ్యాఖ్యానించారు. వచ్చే రెండు లేదా మూడు సంవత్సరాల్లో బీసీసీఐలో ధోనీ కీలక పాత్ర పోషించడం ఖాయమని తాను నమ్ముతున్నానని స్పష్టం చేశారాయన.
అతని విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ.. భారత్లో వర్ధమాన క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్ను చూపుతాయని, టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుందని సునీల్ గవాస్కర్ అన్నారు. ఇదివరకు టీమిండియాకు మెంటార్గా సేవలను అందించాడు ఎంఎస్ ధోనీ. తన ఫస్ట్ టాస్క్లో విఫలం అయ్యాడు కూడా. టీ20 వరల్డ్ కప్ 2021ను ఆడిన భారత జట్టుకు మెంటార్గా పని చేశాడు. జట్టును సెమీ ఫైనల్స్ వరకు కూడా తీసుకెళ్లలేకపోయాడు.