చెన్నై: ఐపీఎల్ 2023లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్. ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొలి రౌండ్లో పోటీ పడ్డాయి. ఇప్పుడు రివర్స్ రౌండ్లో మళ్లీ ఎదురుపడ్డాయి.
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తోన్న ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఢీ కొట్టబోతోన్న నేపథ్యంలో ఈ మ్యాచ్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వర్షం వల్ల లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ను పక్కనపెడిత ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్లల్లో అయిదు విజయాలను సాధించింది. మొత్తం 11 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లను ఆడిన ముంబై ఇండియన్స్ కూడా అయిదు విజయాలను సాధించింది. 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు స్థానం.. 6. ఫస్ట్ రౌండ్లో చెన్నై చేతిలో మట్టికరిచింది రోహిత్ సేన. ఇప్పుడు దానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఎదుర్కొన్న మ్యాచ్లల్లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ట్రాక్ రికార్డ్ ఉంది. వేర్వేరు సీజన్లల్లో వరుసగా జరిగిన అయిదు మ్యాచ్లల్లో ముంబై చేతిలో మట్టికరిచింది ధోనీ సేన. చివరి అయిదు మ్యాచ్లల్లో ఒక్కటీ గెలవలేదు. 2008, 2010లో సీజన్లల్లో చెన్నై గెలవగా.. 2012, 2013, 2015, 2019లో రెండుసార్లు ముంబై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఈ రెండింటి మధ్య ఈ మధ్యాహ్నం ఇదే చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ఆరోది. దీన్ని గెలిచి- ఆ ట్రెడీషన్కు చెన్నై సూపర్ కింగ్స్ చెక్ పెడుతుందా? లేక ఎప్పట్లాగే ఓడుతుందా? అనేది ఈ సాయంత్రానికి స్పష్టమౌతుంది. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం ఏడు మ్యాచ్లు జరగ్గా తొలి రెండింట్లో చెన్నై గెలిచింది. చివరి అయిదింట్లో ముంబైదే విజయం.
2019 మేలో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. అదే చివరిది. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ రెండు జట్లు అదే స్టేడియంలో తలపడనున్నాయి. మొత్తంగా ఐపీఎల్లో చెన్నై-ముంబై మధ్య 35 మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ కూడా ముంబైదే పైచేయి. మొత్తం 20 మ్యాచ్లల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. మిగిలిన 15 మ్యాచ్లు చెన్నై ఖాతాలో పడ్డాయి.