చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- మరోసారి ఫైనల్స్లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్లో ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.
మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది ధోనీ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

ఈ మ్యాచ్లో ధోని చేసిన ఓ పని- ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. ఉద్దేశపూరకంగా అంపైర్ల విలువైన సమయాన్ని వృధా చేశాడనే ఆరోపణలను అతను ఎదుర్కొంటోన్నాడు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆరా తీస్తోంది. ధోనీ నిజంగా తప్పు చేసినట్లు తేలితే మాత్రం అతనిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడకపోవచ్చు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది.
అదే జరిగితే గనక- ఫైనల్స్కు ధోనీ దూరం అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇన్నింగ్ 16వ ఓవర్లో మతీషా పాథిరానను బౌలింగ్ వేయడానికి అంపైర్లు అంగీకరించలేదు. బౌలింగ్ చేయడానికి బంతిని అందుకున్న ఈ శ్రీలంకన్ బౌలర్ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి ఆపేశారు. తొమ్మిది నిమిషాల పాటు గ్రౌండ్లో లేకపోవడం, విశ్రాంతి తీసుకుని బౌలింగ్ చేయడానికి రావడమే కారణమైంది.
దీనిపై ధోనీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. సుమారు అయిదు నిమిషాల పాటు వారితో వాదించాడు ధోనీ. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ 14.2.3 ప్రకారం.. ఓ ప్లేయర్ మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో లేకపోతే అతనిపై నిబంధనలు విధించే అవకాశం అంపైర్లకు ఉంది.
ఎన్ని నిమిషాల పాటు అతను మ్యాచ్లో అందుబాటులో లేడో.. అన్ని నిమిషాలు అతను బౌలింగ్ వేయడానికి, బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు. మతీషా పాథిరాన తొమ్మిది నిమిషాల పాటు మ్యాచ్లో లేకపోవడం వల్ల అతణ్ని బౌలింగ్ చేయడానికి అంపైర్లు అంగీకరించలేదు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ- ధోనీ అంపైర్లతో వాగ్వివాదానికి దిగడం వల్ల అయిదు నిమిషాల సమయం వృధా అయినట్లు గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది.
ఇదే విషయాన్ని కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, సైమన్ డౌల్ కూడా ప్రస్తావించారు. అంపైర్లతో అయిదు నిమిషాల పాటు వాదనలకు దిగం ఏ మాత్రం మంచిది కాదని, ఇది అనవసర చర్యగా అభివర్ణించారు. సరైన సమయంలో మతీషా స్థానంలో మరొక బౌలర్ బౌలింగ్ చేయకుండా ధోనీ అడ్డుకున్నట్టయిందని పేర్కొన్నారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించే ప్రమాదం లేకపోలేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు.