చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- మరోసారి ఫైనల్స్లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్లో ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.
మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది ధోనీ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

ఫైనల్స్ చేరడానికి గుజరాత్ టైటాన్స్కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్ 2లో నెగ్గాల్సి ఉంటుంది. ఇవ్వాళ ఎలిమినేటర్ మ్యాచ్. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది గుజరాత్కు. గెలిచిన జట్టు ఫైనల్స్కు వెళ్తుంది.
గుజరాత్ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు బౌలర్లు. అయిదుమంది బౌలర్లు వికెట్లను పంచుకున్నారు. దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, రవీంద్ర జడేజా, మతీషా పతిరానా రెండు చొప్పున వికెట్లను పడగొట్టారు. తుషార్ దేశ్పాండే ఓ వికెట్ కూల్చాడు. బౌలర్ల ధాటికి గుజరాత్ టైటాన్స్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఎక్కడ కూడా ఏర్పడలేదు.
గత ఏడాది ఐపీఎల్లో అడుగుపెట్టిన శ్రీలంకన్ యంగ్ అండ్ డైనమిక్ బౌలర్ మతీషా పతిరానా అదరగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లను ఆడిన మతీషా 17 వికెట్లు నేలకూల్చాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/15. గత సీజన్లో రెండు మ్యాచ్లే ఆడినప్పటికీ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కీలకంగా ఎదిగాడు.
గుజరాత్ టైటాన్స్పై కూడా రెండు వికెట్లను తీసుకున్నాడు. కీలకమైన విజయ్ శంకర్ను పెవిలియన్ దారి పట్టించాడు. లోయర్ ఆర్డర్లో మహ్మద్ షమీని అవుట్ చేసి విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయం ఇచ్చిన ఆనంద క్షణాలను మతీషా పతిరానా తన తల్లితో పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన చెన్నై హోటల్లో బస చేసిన తల్లిని కలుసుకున్నాడు. చిన్నపిల్లాడిలా తల్లిని ఆలింగనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

మతీషా పతిరానా తల్లి ప్రస్తుతం అతనితో పాటు భారత్లోనే ఉంటోన్నారు. అతని స్వస్థలం శ్రీలంకలోని క్యాండీ. 2002 డిసెంబర్ 18వ తేదీన జన్మించాడు. తండ్రి అనుర పతిరానా ప్రభుత్వ ఉద్యోగి. అతనికి ఇద్దరు అక్కలు విషుక పతిరణ, తరింది పతిరణ. వారిద్దరూ పియానో, గిటారిస్ట్ ప్లేయర్లు. మతీషా బౌలింగ్ స్టైల్.. లసిత్ మలింగను పోలి ఉంటుంది. 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించగలడు.