
వేర్వేరు టోర్నీల్లో బిజీగా..
ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్లో వేర్వేరు ఫ్రాంఛైజీల ప్లేయర్లందరూ తమ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఆసియా కప్ 2022, కౌంటీ, లీగ్, రంజీ మ్యాచ్లల్లో పాల్గొంటోన్నారు. వచ్చే నెల ఆరంభం కాబోయే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసమూ ఆయా ప్లేయర్లందరూ సమాయాత్తమౌతోన్నారు.
వేడి రగిల్చిన సన్రైజర్స్..
ఈ పరిణామాల మధ్య ఐపీఎల్ 2023 సీజన్ వేడి అప్పుడే రగిలింది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. హెడ్ కోచ్ను మార్చేసింది. ఇప్పటివరకు హెడ్ కోచ్గా పని చేసిన టామ్ మూడీని తప్పించింది. ఆయన కాంట్రాక్ట్ను పొడిగించలేదు. టామ్ మూడీ స్థానంలో బ్రియన్ లారాను అపాయింట్ చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. వరుస పరాజయాలను చవి చూస్తూ వస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

గందరగోళానికి తెర..
అదే రోజున చెన్నై సూపర్ కింగ్స్ కూడా వార్తల్లోకెక్కింది. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ఎవరు సారథ్యాన్ని వహిస్తారనే విషయంపై ఏర్పడిన గందరగోళ వాతావరణానికి తెర దించింది. టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఆరు నెలల ముందే స్పష్టతను ఇచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్ తరహాలో పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే టోర్నమెంట్లో తమ జట్టును నడిపించేదెవరో తేల్చేసింది.
చెన్నై కేప్టెన్గా..
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వన్ ఇండియా ట్వీట్ చేసింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలో తాము ఐపీఎల్ 2023లో ఆడబోతోన్నామని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేసినట్లు తెలిపింది.

తొలుత రవీంద్ర జడేజా..
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదనే విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్గా ఆవిర్భవించిన ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. దీనికి కారణాలు లేకపోలేదు. టోర్నమెంట్ ఆరంభంలో రవీంద్ర జడేజా కేప్టెన్గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో సీఎస్కే వరుసగా పరాజయాలను చవి చూసింది.

టోర్నీ మధ్యలో..
దీనితో టోర్నీ మధ్యలోనే కేప్టెన్సీ చేతులు మారింది. మళ్లీ ధోనీ చేతికే వెళ్లింది. ఐపీఎల్ 2023 నాటికి ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతారంటూ ఇదివరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాశీ విశ్వనాథన్ చేసిన తాజా ప్రకటన దీనికి కూడా తెర దించింది. ధోనీ కేప్టెన్గా కొనసాగుతాడంటూ తేల్చేయడంతో- వచ్చే సీజన్లో ఆయన రిటైర్మెంట్ కావట్లేదనేది ఇక్కడ స్పష్టమైంది.


Click it and Unblock the Notifications
