టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా చాలా మంది ట్విట్టర్ ఖాతాలకు ధ్రువీకరణ ఇచ్చే 'బ్లూ టిక్' మార్క్ మాయమైంది. వీళ్లంతా సెలెబ్రిటీలు కావడంతో, వీరి పేర్లతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అభిమానులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గతంలో ట్విట్టర్ ఈ 'బ్లూ టిక్' విధానాన్ని తీసుకొచ్చింది. సదరు సెలెబ్రిటీల ఒరిజినల్ ఖాతాలను గుర్తిస్తూ.. వారి పేరు పక్కన ఈ గుర్తును ఉంచేవారు.
అయితే ట్విట్టర్ను ప్రముఖ బిలియనీర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఈ 'బ్లూ టిక్' విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఈ గుర్తు కావాలని అనుకునే వాళ్లు నెలకు 8 డాలర్లు అంటే మన లెక్కల ప్రకారం రూ.640 కట్టాలని స్పష్టం చేశాడు. లేదంటే వారి ఖాతాలకు ఈ బ్లూ టిక్ తొలగిస్తామని స్పష్టం చేశాడు. ఈ విధానాన్ని 'ట్విట్టర్ బ్లూ'గా మస్క్ అభివర్ణించాడు.

ఈ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకోని కారణంగానే సచిన్ టెండూల్కర్తోపాటు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యూసుఫ్ పఠాన్ తదితరుల ట్విట్టర్ ఖాతాలకు కూడా ఈ బ్లూ టిక్ తొలగించారు. వీళ్లే కాదు.. ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఖాతాకు కూడా ఈ గుర్తు తొలగించారు. అయితే బాస్కెట్ బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ ఖాతాకు ఈ టిక్ మార్కు ఉంది. అతను ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండొచ్చు.
ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చాడు. వీటిలో కంపెనీలకు సంబంధించిన ఖాతాలకు గోల్డ్ కలర్ మార్కు ఇస్తున్నాడు. అలాగే ప్రభుత్వ సంస్థలకు గ్రే కలర్ మార్కు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కంపెనీ తమ ఖాతాను వెరిఫై చేయించుకోవాలంటూ వెయ్యి డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే అఫీలియేటెడ్ మార్కెటింగ్ చేసే వాళ్లు అయితే.. గుర్తింపు కోసం యాభై డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
వీటిలో ఎలాంటి ప్లాన్ తీసుకోని కారణంగానే ప్రముఖ సెలెబ్రిటీలు అని కూడా చూడకుండా వాళ్ల ఖాతాలకు ఉండే బ్లూ టిక్ మార్కును ట్విట్టర్ తొలగించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను మిగతా కంపెనీల నుంచి వేరు చేసేందుకు.. 'స్టేట్ అఫీలియేటెడ్' అని చూపిస్తోంది. మరి మన స్టార్ క్రికెటర్లు కూడా ఈ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకొని మళ్లీ బ్లూ టిక్ తీసుకుంటారేమో చూడాలి.