
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో తలపడేందుకు రెడీ అయింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందని రెండు జట్ల అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. కానీ హిస్టరీ చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం గుజరాత్నే వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చివరగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచులన్నింట్లో విజయం గుజరాత్దే.
గతేడాది తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఎవరూ ఊహించని విధంగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గుజరాత్ రెండుసార్లు తలపడింది. పూణేలోని ఎంసీఏ మ్యాచ్లో ఈ రెండు జట్లు మొదట తలపడ్డాయి. రవీంద్ర జడేజా సారధ్యంలోని చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (73), అంబటి రాయుడు (46), జడేజా (22) రాణించారు. దీంతో చెన్నై జట్టు ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో డేవిడ్ మిల్లర్ (94), రషీద్ ఖాన్ (40) అదరగొట్టడంతో గుజరాత్ మరో బంతి మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసేసింది. ఆ తర్వాత మరోసారి వాంఖడే వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ (53) రాణించాడు. కానీ గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో చెన్నై 133/5 స్కోరు చేసింది. వృద్ధిమాన్ సాహా (67), మాథ్యూ వేడ్ (20) రాణించడంతో గుజరాత్ ఈ లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేజ్ చేసేసింది. ఇలా రెండు మ్యాచుల్లోనూ గుజరాత్ జయభేరి మోగించింది.
ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచుల్లోనూ గుజరాత్ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో కూడా తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. చెన్నై ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా తమ జట్టు టోర్నీని విజయంతో మొదలు పెడుతుందని ధీమాగా ఉన్నారు. మరి ఈ అంచనాలను అందుకుని, గతేడాది పరాభవాలకు చెన్నై జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక ధోనీ సారధ్యంలో కూడా ఈ జట్టుకు మరో పరాజయం తప్పదా? అనేది ఆసక్తిగా మారింది.