ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నెలకొంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు సైతం సంభవిస్తోండటం ఆందోళనకు గురి చేస్తోంది అత్యధిక కేసులు మహారాష్ట్ర నుంచే వెలుగులోకి వస్తోన్నాయి. దీనిపై అటు కేంద్రం కూడా సమీక్షలు నిర్వహించింది.
దేశంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 6,050 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీని బారిన పడి 14 మరణించారు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,30,943కు చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు పెరిగింది.

ఈ పరిణామాల మధ్య దేశంలో ఐపీఎల్ 2023 మ్యాచ్లు జరుగుతున్నాయి. కిందటి నెల 31వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ సీజన్ గ్రాండ్గా ఆరంభమైంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ముగిశాయి. ఇవ్వాళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్- సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇది పదో మ్యాచ్.
అటు రసవత్తరంగా ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతోండటం, ఇటు దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అప్రమత్తమైంది. ఫ్రాంఛైజీల యాజమాన్యాలను అలర్ట్ చేసింది. కొత్తగా కోవిడ్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవని అయినప్పటికీ జాగ్రత్త తప్పదని పేర్కొంది.
ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఎవ్వరు కూడా కరోనా బారిన పడకుండా ఎక్స్ట్రా ప్రికాన్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఆయా ఫ్రాంఛైజీలను సూచించింది. వారికి తరచూ యాంటీజెన్/ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించాల్సి రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులను జరుపుతోందని గుర్తు చేసింది.
త్వరలోనే కోవిడ్ మార్గదర్శకాలు విడుదల కావొచ్చని అంచనా వేసింది. ఇదే స్థాయిలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవయ్యే పరిస్థితులు ఏర్పడితే- బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్లు జరిగే స్టేడియాలను 50 శాతం వరకే భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వొచ్చు. మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేయొచ్చు.