
ముంబై: క్రికెట్ ఆడే దేశాలన్నీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మకాం వేశాయి. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్లో పరస్పరం తలపడుతోన్నాయి. ఛాంపియన్గా ఆవిర్భవించడానికి పోటీ పడుతోన్నాయి. ఈ రేసు నుంచి వెస్టిండీస్ తప్పుకొంది. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. సూపర్ 12 చేరుకోలేక చేతులెత్తేసిందీ మాజీ ఛాంపియన్. ఈ సంవత్సరం ఛాంపియన్ ఎవరనేది నవంబర్ 13వ తేదీన జరిగే ఫైనల్స్లో తేలుతుంది.
ఈ పరిణామాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తాజా అప్డేట్ బయటికొచ్చింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో వేలం పాటను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అన్నీ సవ్యంగా కుదిరితే- ఐపీఎల్ 2023 వేలంపాటకు ఇస్తాంబుల్ వేదికగా మారుతుంది. ఇస్తాంబుల్కు వెళ్లడం కుదరకపోతే న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులను ఆప్షన్గా పెట్టుకుంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత ఫ్రాంఛైజీలు తమ జట్టు నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల వివరాలను బీసీసీఐకి అందజేయొచ్చని తెలుస్తోంది.
నవంబర్ 15వ తేదీ నాటికి ప్లేయర్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ కేపిటల్స్ ముగ్గురు ప్లేయర్లను వేలం పాట కోసం విడిచి పెట్టనుంది. టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్, వైజాగ్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్, మన్దీప్ సింగ్.. ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురినీ రిలీజ్ చేయాలని ఢిల్లీ కేపిటల్స్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
బెంగళూరులో నిర్వహించిన మెగా వేలంలో 10.75 కోట్ల రూపాయలతో శార్దుల్ ఠాకూర్ను తీసుకుంది ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ. ఐపీఎల 2022 సీజన్లో 14 మ్యాచ్లల్లో 15 వికెట్లు తీసుకున్నాడు గానీ 9.79 ఎకానమీని నమోదు చేయడం మైనస్ పాయింట్. ఒక్కో ఓవర్కు సుమారు 10 పరుగులను ఇచ్చుకున్నాడు ఈ సీజన్లో. గతంలో చెన్నై సూపర్ కింగ్స్లో ప్రధాన బౌలర్గా వ్యవహరించిన శార్దుల్ ఠాకూర్ను ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది.
శార్దుల్ ఠాకూర్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్, మన్దీప్ సింగ్ను కూడా విడిచిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కేపిటల్స్ కేప్టెన్ రిషబ్ పంత్కు బ్యాకప్ వికెట్ కీపర్గా ఉంటూ వచ్చాడు కేఎస్ భరత్. చాలా గేమ్లను అతను ఆడలేదు. పృథ్వీ షా అనారోగ్యంతో ఉన్నప్పుడు టోర్నమెంట్ చివరిలో మాత్రమే రీప్లేస్ అయ్యాడు. మన్దీప్ సింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మూడు మ్యాచ్లకు మాత్రమే పరిమితం అయ్యాడు.