ముంబై: వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలకు కేంద్రబిందువగా చెప్పుకొనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్పై మరోసారి బెట్టింగ్ మాఫియా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ బుకీల మాయాజాలంలో పడి శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ మెయ్యప్పన్.. తమ కేరీర్ను బుగ్గిపాలు చేసుకున్నారు.
ఇప్పుడు ఈ బెట్టింగ్ మాఫియా నెట్వర్క్ తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్పై పడింది. ఆర్సీబీకి సంబంధించిన కీలకమైన అంతర్గత సమాచారాన్ని తనకు చేరవేయాలంటూ ఓ వ్యక్తి సిరాజ్ను సంప్రదించాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ధృవీకరించింది కూడా. బీసీసీఐ ఏర్పాటు చేసిన యాంటీ కరెప్షన్ యూనిట్.. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టింది.

గుర్తు తెలియని ఆ వ్యక్తిని హైదరాబాద్కు చెందిన ఓ డ్రైవర్గా గుర్తించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతనికి బుకీలు లేదా బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీస్తోన్నట్లు పేర్కొన్నాయి. అతను బుకీ కాకపోవచ్చని ప్రాథమికంగా భావిస్తోన్నట్లు బీసీసీఐ యాంటీ కరెప్షన్ యూనిట్ స్టాఫ్ ఒకరు అభిప్రాయపడ్డారు.
దీనిపై సమగ్ర విచారణను నిర్వహించిన తరువాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు. ఆ వ్యక్తి- ఐపీఎల్ మ్యాచ్లపై పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి నష్టపోయాడని, దాన్ని మళ్లీ సంపాదించుకోవడానికి ఆర్సీబీపై బెట్టింగులు పెట్టాలని నిర్ణయించకున్నాడని, అందుకే జట్టుకు సంబంధించిన అంతర్గత సమాచారం, ప్లేయర్ల వివరాలను తనకు తెలియజేయాలని సిరాజ్ను సంప్రదించినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆ వ్యక్తి తమ అదుపులోనే ఉన్నాడని, అతని నుంచి పూర్తి వివరాలను సేకరిస్తోన్నామని వివరించారు. సిరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఆ వ్యక్తి సంప్రదింపులు జరిపిన వెంటనే మహ్మద్ సిరాజ్- అప్రమత్తం అయ్యాడని, ఈ సమాచారాన్ని తమకు చేరవేశాడని బీసీసీఐ ఏసీయూ అధికారికంగా తెలిపింది.
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. కాగా- మహ్మద్ సిరాజ్ స్వస్థలం కూడా హైదరాబాదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకటి నుంచే సిరాజ్తో అతనికి సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తోన్నట్లు బీసీసీఐ యాంటీ కరెప్షన్ యూనిట్ తెలిపింది.