ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్తో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని టీమిండియా అండర్ 19 కెప్టెన్ యష్ ధూల్ తెలిపాడు. కాగా ఐపీఎల్లో యష్ ధూల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే. మెగా వేలంలో యష్ ధూల్ను 50 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ ముగించుకుని ఇటీవల యష్ ధూల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా తొలి సారి ఐపీఎల్ ఆడబోతున్న యష్ ధూల్, విక్కీ ఓత్స్వాల్, అశ్విన్ హెబ్బర్ మాట్లాడిన వీడియోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
తాను తొలి సారి ఐపీఎల్ ఆబోతున్నానని, వీలైనంత వరకు మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తానని ఆ వీడియోలో యష్ ధూల్ చెప్పాడు. టీం హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఇక డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి ఆడాలని మనసులోని కోరికను బయటపెట్టాడు. ఇక టీవీల్లో ఐపీఎల్ చూడడం నుంచి, ఇప్పుడు నేరుగా ఐపీఎల్ ఆడేవరకు చాలా దూరం ప్రయాణించానని విక్కీ ఓత్స్వాల్ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ను కలుసుకోవడం తనకు మరిచిపోలేని అనుభూతని తెలిపాడు. ఇక తనకు ఆదర్శంగా నిలిచిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ను వీలైనంత త్వరగా కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. టీ20 ఫార్మాట్లో ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో అక్షర్ పటేల్ నుంచి పలు సూచనలు తీసుకోనున్నట్లు విక్కీ ఓత్స్వాల్ తెలిపాడు. కాగా మెగా వేలంలో విక్కీ ఓత్స్వాల్ను ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం తనకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు అశ్విన్ హెబ్బర్ చెప్పుకొచ్చాడు. తొలిసారిగా ఐపీఎల్ ఆడనుండడంతో కొంత నెర్వస్గా ఉందని చెప్పాడు. అయితే ఒకసారి బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక మిగతా విషయాలన్నింటిని పక్కనపెట్టేస్తానని అశ్విన్ హెబ్బర్ తెలిపాడు. కాగా అశ్విన్ హెబ్బర్ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 27న జరగనుంది.