
లండన్: ఐపీఎల్ 2022లో ఆడుతున్న కొందరు జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లు విజ్డెన్ తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్నారు. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచ్ల కోసం 11 ప్లేయర్లతో కూడిన ఆల్టైమ్ గ్రేట్ జట్లను ప్రకటించింది. ఈ రెండు ఫార్మట్ల కోసం వేర్వేరుగా తుదిజట్లను ప్రకటించింది. హైలైట్ ఏమిటంటే- ఈ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్న భారత క్రికెటర్ ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే సచిన్ టెండుల్కర్. ఆయన మినహా మరెవరికీ ఈ రెండు జట్లలో చోటు కల్పించలేదు విజ్డెన్.
పాకిస్తాన్ నుంచి ఇద్దరు ప్లేయర్లకు రెండు జట్లల్లోనూ చోటు దక్కింది. వన్డే ఇంటర్నేషనల్స్ కోసం ఎంపిక చేసిన 11 మంది ప్లేయర్లల్లో- సచిన్ టెండుల్కర్ (భారత్), క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లీ (భారత్), రామ్నరేష్ శరణ్ (వెస్టిండీస్), షిమ్రోన్ హెట్మెయిర్ (వెస్టిండీస్), అబ్దుల్ రజాక్ (పాకిస్తాన్), ఇర్ఫాన్ పఠాన్ (భారత్), రషీధ్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), వకార్ యూనిస్ (పాకిస్తాన్), సక్లాయిన్ ముస్తాక్ (పాకిస్తాన్).
టెస్ట్ జట్టులో గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్), డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా), సచిన్ టెండుల్కర్ (భారత్), జావెద్ మియాందాద్ (పాకిస్తాన్), గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్-భారత్), ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండ్, వకార్ యూనిస్ (పాకిస్తాన్), కగిసో రబడ (దక్షిణాఫ్రికా), సక్లాయిన్ ముస్తాక్ (పాకిస్తాన్). తన కేరీర్ను ఆరంభించిన కొద్ది రోజుల్లోనే రిషభ్ పంత్ విజ్డెన్ టెస్ట్ జట్టులో చోటు పొందడం, హేమాహేమీల్లాంటి ప్లేయర్ల సరసన తన పేరును నమోదు చేయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వీరిలో చాలామందికి ఐపీఎల్తో అనుబంధం ఉంది. సచిన్ టెండుల్కర్ ఇదివరకు ముంబై ఇండియన్స్ తరఫున ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో పాల్గొన్నాడు. క్వింటన్ డికాక్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో, షిమ్రోన్ హెట్మెయిర్ రాజస్థాన్ రాయల్స్లో ఉన్నారు. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదివరకు ఐపీఎల్ ఆడిన ప్లేయరే. రిషభ్ పంత్.. ఢిల్లీ కేపిటల్స్కు సారధ్య బాధ్యతలను వహిస్తున్నాడు. కగిసో రబడ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ను లీడ్ చేస్తోన్నాడు.