
న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో శ్రీలంక పేసర్ మతీషా పతిరనను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి తీసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఐపీఎల్ ఈ సీజన్ తొలి మ్యాచ్లో మిల్నే గాయానికి గురయ్యాడు. గాయం నుంచి కోలుకుని తర్వాతి మ్యాచ్లకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం మాత్రం మానలేదు. దీంతో అతను ఇప్పుడు ఐపీఎల్ పూర్తి సీజన్కు దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రీలంకకు చెందిన 19ఏళ్ల యువ మీడియం పేసర్ అయిన మతీషాను చెన్నై రూ.20లక్షల బేస్ ప్రైస్తో జట్టులోకి తీసుకుంది.
మతీషా పతిరన 2020, 2022 అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంక తరఫున ఆడాడు. శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బౌలింగ్ శైలిని పోలి ఉండే మతీషా తన స్లింగ్లింగ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అయితే అతను లిస్ట్ Aలో ఒకటే మ్యాచ్ ఆడగా.. రెండు టీT20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అలాగే ఈ రెండు మ్యాచ్ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఈ యువ శ్రీలంకన్ పేసర్పై ఏమాత్రం అంచనాలు లేకున్నా.. మాలింగ లాంటి బౌలింగ్ శైలి కావడం.. అలాగే పూర్తి కొత్త బౌలర్ కావడంతో ఈ పేసర్ ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి బ్యాటర్లు తొలుత కొంత ఇబ్బంది పడతారని చెప్పవచ్చు.

వెన్ను గాయంతో ఇప్పటికే ఐపీఎల్ పూర్తి సీజన్కు దూరమైన సీఎస్కే స్టార్ పేసర్ దీపక్ చాహర్ తర్వాత ఇప్పుడు మిల్నే కూడా సీఎస్కేకు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన మిల్నే 2.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వికెట్లేమీ తీయకుండా 19పరుగులు ఇచ్చాడు. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మిల్నే త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తాడని చెప్పినప్పటికీ అది జరగకపోవడంతో మిల్నే ఐపీఎల్కు పూర్తిగా దూరమయ్యాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో సీఎస్కే ఐదు ఓడిపోయింది. సీఎస్కే బౌలింగ్ పేలవంగా ఉంది. నేడు ముంబై ఇండియన్స్తో సీఎస్కే తలపడనుంది. మతీషా పతిరనా క్వారంటైన్ అనంతరం బయోబబుల్లో చేరి సీఎస్కే జట్టుతో కలుస్తాడు.