మరో సీజన్ ఆడాలి:
వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా క్రిక్బజ్తో మాట్లాడుతూ... ఎంఎస్ ధోనీ మరో ఐపీఎల్ సీజన్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ఆలోచన చేయాలని సూచించాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణమైన జట్టు. టీమిండియాలో ఎవరూ ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని ముందుగు తీసుకెళ్లలేరు. చెన్నై జట్టులో కూడా మరో కెప్టెన్ ఇంత సాధించడం చాలా కష్టం. చెన్నై జట్టులో ధోనీ ఇంకా ఒక సంవత్సరం పాటు ఆడాలని నేను భావిస్తున్నాను. అతను తదుపరి సీజన్ ఆడి ఆ తరువాత రిటైర్ అవ్వాలి' అని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. ఇక 104 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు.
సక్సెస్ను గణాంకాలతో కొలుస్తారు:
'ఒక కెప్టెన్ సక్సెస్ను గణాంకాలతో కొలుస్తారు. ఆ లెక్కన చూసుకున్నా కూడా నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచి, 9 సార్లు ఫైనల్లో ఆడిన చెన్నై జట్టుకు ధోనీ సారధ్యం వహించిన సంగతి మర్చిపోకూడదు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మ.. ధోనీకి సమీపంలో ఉన్నా కూడా 9 సార్లు ఫైనల్ చేరాలంటే మాత్రం అతనికి ఇంకొంత సమయం పడుతుంది. రీఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్లో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున సీజన్ను ముగించింది. అంటే ఐపీఎల్ ప్రారంభమైన 14 సంవత్సరాల్లో మూడేళ్లు ఈ జట్టు పోటీలో లేదు. కానీ మిగతా సీజన్లలో 9 సార్లు ఫైనల్ చేరి, నాలుగు సార్లు కప్పు కొట్టారంటే మాటలు కాదు' అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ధోనీనే రిటైన్ చేసుకుంటాం:
వచ్చే ఏడాది ఐపీఎల్లో మరో రెండు జట్లు కొత్తగా చేరనున్నాయి. ఈ క్రమంలో మెగా ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఎంఎస్ ధోనీ భవితవ్యంపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. అయితే చెన్నై జట్టు వచ్చే వేలంలో రిటెన్షన్ అవకాశం ఉంటే తాము తొలిగా ధోనీనే రిటైన్ చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అవకాశం కచ్చితంగా ఉంటుందని, కానీ ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తారో తెలియదని పేర్కొంది. ఎంతమందికి రిటైన్ అవకాశం ఉన్నా.. మా తొలి ప్రాధాన్యం మాత్రం మహీకే అని చెన్నై పేర్కొంది.
ఏది మంచిదో అదే చేస్తా:
ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఐపీఎల్ 2022లో నేను ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం ముఖ్యం కాదు. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లను తయారు చేయడం చాలా ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం' అని అన్నాడు.