
నెక్స్ట్ మ్యాచ్ బెంగళూరుతో..
తన తరువాతి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనబోతోందీ ఆరెంజ్ ఆర్మీ. శనివారం ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. తొలి రెండు మ్యాచ్లల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓటమిపాలైనప్పటికీ.. ఆ తరువాత పుంజుకొంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కత నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ను మట్టి కరిపించింది.

బౌలింగ్ వింగ్ కీలకం..
సన్రైజర్స్ సాధిస్తోన్న విజయాల్లో బౌలింగ్ డిపార్ట్మెంట్ పోషిస్తోన్న పాత్ర కీలకం. పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో విషయం క్లియర్ కట్గా తేలింది. భారీ స్కోర్ దిశగా సాగుతున్న పంజాబ్ బ్యాటర్ల దూకుడుకు సన్రైజర్స్ బౌలర్లు కళ్లెం వేసిన తీరు ఓ మాస్టర్ పీస్. డెత్ ఓవర్లలో బౌలర్లు నిప్పులు చెరిగారు. టీ20 వంటి ధనాధన్ ఫార్మట్లో చివరి అయిదు ఓవర్లల్లో 19 పరుగులు మాత్రమే ఇవ్వడం- సన్రైజర్స్ బౌలర్ల స్టామినాకు అద్దం పట్టింది.

ఉమ్రాన్ మాలిక్ ఫైర్..
భువనేశ్వర్ కుమార్ తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇది అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 2018 తరువాత ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లను తీసుకోవడం ఇదే తొలిసారి. సన్రైజర్స్ ఇన్నింగ్లో హైలైట్గా చెప్పుకోదగ్గది- చివరి ఓవర్. స్పీడ్స్టర్ ఉమ్రాన్ మలిక్ దీన్ని సంధించాడు. ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు నేలకూల్చాడు. ఒడియన్ స్మిత్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరాలను బలి తీసుకున్నాడు. అర్ష్దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు.

సెలెక్టర్ల దృష్టిలో పడినట్టే..
ఉమ్రాన్ మాలిక్లో కనిపించిన ఆ ఫైర్.. అభిమానులనే కాదు రాజకీయ నాయకులను సైతం కట్టి పడేసింది. అతణ్ని జాతీయ జట్టు సెలెక్ట్ చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సూచించారు. ఆ ఫైర్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేసినట్టే. దక్షిణాప్రికాతో తలపడబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్లోనే ఈ సిరీస్ ఆరంభం కాబోతోన్నందున.. దేశీయ పిచ్లపై నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మాలిక్కు బీసీసీఐ బెర్త్ కన్ఫర్మ్ చేయొచ్చని తెలుస్తోంది.

అయిదు మ్యాచ్ల సిరీస్..
అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.


Click it and Unblock the Notifications
