
కోల్కతా: టీమిండియా సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ ఈ సారి కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మెగా వేలంలో ఈ సీనియర్ పేసర్ను కోల్కతానైట్ రైడర్స్ మేనేజ్మెంట్ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఉమేష్ యాదవ్ కోల్కతా జట్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా 2014లో ఉమేష్ యాదవ్ కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. గౌతం గంభీర్ కెప్టెన్సీలోని నాటి కేకేఆర్ జట్టు ట్రోఫీ గెలుచుకుంది. కానీ ఆ తర్వాత కోల్కతా వదిలేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు.
ఇక కోల్కతానైట్రైడర్స్ జట్టులోకి తిరిగి రావడం పట్ల ఉమేష్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా జట్టుతో కలిసి 2014లో తాను ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సంగతులను ఉమేష్ గుర్తు చేసుకున్నాడు. అలాగే కోల్కతా నైట్రైడర్స్ను తన లక్కీ టీంగా పేర్కొన్నాడు. తన ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉండడంతో 3 రోజుల క్వారంటైన్ సునామయసంగా గడిచిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇక తన ఫిట్నెస్ గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం తాను ఫిట్గా ఉన్నట్లు ఉమేష్ యాదవ్ తెలిపాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. మరోసారి కోల్కతా నైట్రైడర్స్కు ట్రోఫీ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, అందకోసం తన వంతు కృషి చేస్తానని ఉమేష్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానుండడంతో, ఉమేష్ యాదవ్కు తుది జట్టులో చోటు ఖాయంగా చెప్పుకోవాలి. ఐపీఎల్లో ఇప్పటివరకు 121 మ్యాచ్లు ఆడిన ఉమేష్ యాదవ్ 119 వికెట్లు తీశాడు. ఇక కోల్కతానైట్రైడర్స్ తమ తొలి మ్యాచ్లో ఈ నెల 26న చెన్నైసూపర్ కింగ్స్తో తలపడనుంది.
కోల్కతానైట్ రైడర్స్ పూర్తి జట్టు 2022
శ్రేయస్ అయ్యర్(12.25 కోట్లు), ఆండ్రీ రసెల్ (12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు) నితీశ్ రాణా ( 8 కోట్లు), శివమ్ మావి(7.25 కోట్లు), ప్యాట్ కమిన్స్(7.25 కోట్లు), ఉమేశ్ యాదవ్(2 కోట్లు), సామ్ బిల్లింగ్స్(2 కోట్లు), అలెక్స్ హేల్స్(1.50 కోట్లు), టిమ్ సౌథీ(1.50 కోట్లు), అజింక్య రహానె(కోటి), నబీ(కోటి), షెల్డన్ జాక్సన్(60 లక్షలు), రింకు సింగ్(55 లక్షలు), అశోక్ శర్మ( 55 లక్షలు), చమిక కరుణరత్నె(50 లక్షలు), అభిజిత్ తోమర్(40 లక్షలు), అమన్ఖాన్, అనుకుల్ రాయ్, ప్రతామ్ సింగ్, రసిఖ్ దార్, బాబా ఇంద్రజిత్(వీరందరికీ 20 లక్షలు).