
వెటరన్లు లేని టోర్నీ..
అంతా బాగానే ఉన్నప్పటికీ- ఐపీఎల్ అన్ని సీజన్లపైనా తమదైన ముద్ర వేసిన ముగ్గురు లెజెండరీ క్రికెటర్లు ఇక కనపించకపోవచ్చు. భారీ షాట్లతో పరుగుల వరద పారించిన వెటరన్ ప్లేయర్లు దాదాపుగా కనుమరుగైనట్టే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..లల్లో ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించే సత్తా ఉన్న సీనియర్లు ఐపీఎల్ మ్యాచ్లకు శాశ్వతంగా దూరమైనట్టే. ఒకరకంగా ఐపీఎల్లో వారి శకం ముగిసినట్టే. ఆ ముగ్గురు ప్లేయర్లు లేని తొలి ఐపీఎల్ టోర్నమెంట్ ఇదే కానుంది.

సీనియర్ల త్రయం..
క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, సురేష్ రైనా. ఈ ముగ్గురినీ ఈ ఐపీఎల్ మిస్ అయింది. విధ్వంసకారుడిగా ప్రపంచ క్రికెట్లో పేరు తెచ్చుకున్న కరేబియన్ క్రికెట్ కింగ్ క్రిస్ గేల్ ఐపీఎల్కు దూరం అయ్యాడు. వేలంపాటలోనూ అతను తన పేరును నమోదు చేసుకోలేదు. మిస్టర్ 360 డిగ్రీస్గా ప్రేక్షకులు పిలిపించుకునే దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పరిస్థితీ ఇంతే. ఏబీ కూడా ఈ వేలంపాటకు దూరంగా ఉన్నాడు. పేరు రిజిస్టర్ చేయించుకోలేదు. ఈ ఇద్దరికీ భిన్నం- సురేష్ రైనా. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా వేలంలో పాల్గొన్నప్పటికీ- అతణ్ని ఏ ప్రాంఛైజీ కూడా జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు.

ఆరు సెంచరీలతో..
విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్.. 2009లో ఐపీఎల్ టోర్నమెంట్లో ఎంట్రీ ఇచ్చాడు. గత సంవత్సరం వరకూ ఏ ఒక్క సీజన్ కూడా అతను మిస్ చేసుకోలేదు. అన్ని సీజన్లలో పాల్గొన్నాడు. 142 మ్యాచ్లను ఆడాడు. 4,965 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. రెండు సార్లు 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. లేకుంటే ఈ సెంచరీల సంఖ్య పెరిగేదే. 175 పరుగులు అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్. 20 ఓవర్ల ఫార్మట్లో 175 పరుగులు చేశాడంటే.. క్రిస్ గేల్ ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్లేయర్.. ఫామ్ను కోల్పోతూ వచ్చాడు. ఈ సీజన్కు కనుమరుగయ్యాడు.

అయిదు వేల పరుగులకు పైగా..
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ 2008లో ఐపీఎల్ కేరీర్ను ప్రారంభించాడు. అన్ని సీజన్లల్లో ఆడాడు. 184 మ్యాచ్లల్లో 5,162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 అర్ధసెంచరీలు ఉన్నాయి. గెలుపుగుర్రంలా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జట్టును విజయతీరాలకు చేర్చగలడనే పేరుంది. బౌలర్ చేతి నుంచి వెలువడిన బంతిని స్టేడియంలో ఎటు వైపయినా బాదేయగల టాలెంట్ ఏబీడీ సొంతం. అందుకే మిస్టర్ 360 డిగ్రీస్గా ఫ్యాన్స్ పిలుచుకుంటారు.

మిస్టర్ ఐపీఎల్..
మిస్టర్ ఐపీఎల్గా సురేష్ రైనాకు పేరుంది. ఈ ఐపీఎల్ సీజన్లో అతను తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ.. ఏ ఫ్రాంఛైజీకి కూడా అతణ్ని జట్టులోకి తీసుకోలేదు. ఇది కాస్తా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటిదాకా 205 ఐపీఎల్ మ్యాచ్లను ఆడిన సురేష్ రైనా 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి. గత సంవత్సరం తలెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీతో తలెత్తిన వివాదమే అతను ఎంపిక కాకపోవడానికి కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












