|
ఉమ్రాన్ మాలిక్పై కేటీఆర్ ప్రశంసలు
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ''రా పేస్తో నిండిన నమ్మశక్యం కాని స్పెల్ #ఉమ్రాన్ మాలిక్'' అంటూ రాసుకొచ్చారు. అలాగే బహుషా ఐపీఎల్లో ఇది అత్యుత్తమ ఓవర్ అయి ఉంటుందని చప్పట్లతో అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అలాగే ఉమ్రాన్ మాలిక్ వేసిన అద్భుత ఓవర్కు సంబంధించిన గణాంకాలు ఉన్న ఫోటోను మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ మ్యాచ్లను వీక్షిస్తుంటారు. గతంలో భారత్ జట్టు మంచి మంచి విజయాలు సాధించినప్పుడు కూడా మంత్రి ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ఉమ్రాన్ మాలిక్ సూపర్ బౌలింగ్
కాగా ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ చెలరేగాడు. చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ చేసి మూడు వికెట్లు కూడా తీశాడు. చివరి బంతికి ఓ రనౌట్ కూడా లభించడంతో పంజాబ్ కింగ్స్ 151 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్లు తీసి 28 పరుగులిచ్చాడు. కాగా ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ అత్యుత్తమ గణాంకాలు ఇవే. ఇక ఈ ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగంతో బౌలింగ్ చేస్తున్న బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
సన్రైజర్స్ విజయం
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆల్రౌండ్ ప్రదర్శనంతో అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బౌలింగ్లో సన్రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (3-22), ఉమ్రాన్ మాలిక్ (4-28) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 151 పరుగులకే ఆలౌటైంది.
చివరి ఓవర్లో 3 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ మెయిడెన్ చేశాడు. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని సన్రైజర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో ఎయిడెన్ మాక్రమ్(41), నికోలస్ పూరన్(35), అభిషేక్ శర్మ రాణించారు.