ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో అన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్న ముంబై ఇండియన్స్ జట్టుకు మరో చేదు వార్త అందింది. ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ దాదాపు తప్పుకొన్నట్టే. పాయింట్ల పట్టికలో పదో స్థానానికి చేరుకున్న తరువాత.. ఇక అక్కడి నుంచి ముందుకు కదల్లేదు. 11 మ్యాచ్లల్లో రెండంటే రెండు విజయాలను మాత్రమే సాధించింది. నాలుగు పాయింట్లకే పరిమితమైంది. ఇంకో మూడు మ్యాచ్లను ఆడాల్సి ఉంది రోహిత్ సేన.
తన తదుపరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఢీ కొట్టనుంది. గురువారం ముంబై వాంఖెడె స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొంటుంది. దీనితో లీగ్ దశను ముగించుకుంటుంది ముంబై ఇండియన్స్. ఈ మూడు మ్యాచ్లను గెలిచినా ఆ జట్టు ఖాతాలోకి చేరేది 10 పాయింట్లే. ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేకపోవడం వల్ల తిరుగుముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా- ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయపడటం ఆ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. హైదరాబాదీ తిలక్ వర్మతో కలిసి మిడిలార్డర్లో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ డాషింగ్ బ్యాటర్ గాయం వల్ల దూరం అయ్యాడు. ఎనిమిది మ్యాచ్లల్లో మూడు అర్ధసెంచరీలతో 303 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 68 పరుగులు. 145.67 స్ట్రైక్ రేట్తో దూకుడుగా ఆడాడు.
తాజాగా సూర్యకుమార్ యాదవ్ గాయంపై అప్డేట్ వెలువడింది. గాయం తీవ్రత అధికంగా ఉండటం వల్ల కనీసం నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ గాయం ప్రభావం- దక్షిణాఫ్రికా సిరీస్పైనా పడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి రూల్డ్ అవుట్ అయిన సూర్యకుమార్ యాదవ్.. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కూ దూరం అవుతాడనే అంచనాలు ఉన్నాయి.
ఈ నెల 6వ తేదీన గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను గాయపడ్డాడు. రన్ తీసే క్రమంలో ఎడమ మోచేతికి గాయమైంది. వాపు తగ్గట్లేదని, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఫిజియోథెరపిస్ట్ పేర్కొన్నారు. అయిదు టీ20 మ్యాచ్లను ఆడటానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్కు రానుంది. ఈ సిరీస్లో తొలి రెండు లేదా మూడు మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ దూరం అవుతాడని తెలుస్తోంది.