
మరికొద్దిసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. గాయాలతో ఇంకా ఐపీఎల్లో అడుగుపెట్టని ఆ జట్ల స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ తాజాగా తమ తమ టీంలలో చేరిపోయారు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరగా.. ఆల్రౌండర్ దీపక్ చాహర్ చెన్నైసూపర్ కింగ్స్లో జట్టులో చేరిపోయాడు. దీపక్ చాహర్ అయితే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ కనిపించాడు. జట్టులో చేరినప్పటికీ వీరిద్దరు కూడా తమ తమ జట్లు ఆడబోయే తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు.
కాగా వీరిద్దరు గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్తో సిరీస్లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో సిరీస్కు దూరమయ్యాడు. ఇక సౌతాఫ్రికా పర్యటన అనంతరం గాయపడిన దీపక్ చాహర్ స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్లకు దూరంగా ఉన్నాడు. ఇక మెగా వేలానికి ముందే సూర్య కుమార్ యాదవ్ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. ఇందుకుగాను ముంబై అతనికి 8 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఇక దీపక్ చాహర్ను మెగా వేలంలో చెన్నైసూపర్ కింగ్స్ 14 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది.
కాగా మరికాసేపట్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కోల్కతానైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇరు జట్లు కూడా నూతన కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ను శ్రేయస్ అయ్యర్ నడిపించనుండగా.. చెన్నైసూపర్ కింగ్స్ను రవీంద్ర జడేజా నడిపించనున్నాడు. ఈ రెండు జట్లే గతేడాది జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ తలపడ్డాయి. ఇక ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 26 సార్లు తలపడగా.. 17 సార్లు చెన్నైసూపర్ కింగ్స్, 8 సార్లు కోల్కతానైట్ రైడర్స్ గెలిచాయి.