సోమవారం గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ రెండు చెత్త రికార్డులను అందుకున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా రికార్డును అధిగమించగా.. డేల్ స్టెయిన్ రికార్డును సమం చేశాడు. అసలు ఏం జరిగిందంటే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. అయితే ఇందులో గుజరాత్ ఓపెనర్లు చేసింది 5 పరుగులే కాగా ఎక్స్ట్రాల రూపంలోనే 12 పరుగులు ఇచ్చాయి. ఇందులో వైడ్ల రూపంలోనే భువి 11 పరుగులిచ్చాడు.
భువి వైడ్గా వేసిన రెండు బంతులు కీపర్కు కూడా అందకపోవడంతో అవి ఏకంగా బౌండరీ లైన్ను దాటాయి. దీంతో ఆ రెండు సార్లు 5 పరుగుల చొప్పున 10 పరుగులు వచ్చాయి. మరొక వైడ్ కలుపుకుని ఆ ఓవర్లో వైడ్ల రూపంలోనే భువి 11 పరుగులు ఇచ్చాడు. అలాగే లెగ్బైస్లో కూడా ఒక పరుగు వచ్చింది. దీంతో ఐపీఎల్లో ఒకే ఓవర్లో వైడ్ల రూపంలో అత్యధిక పరుగులిచ్చిన ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ చెత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో 2012లో ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా వైడ్ల రూపంలో ఇచ్చిన 10 పరుగుల చెత్త రికార్డును సైతం అధిగమించాడు. అలాగే ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అత్యధిక పరుగులిచ్చిన డేల్ స్టెయిన్ రికార్డును కూడా భువనేశ్వర్ కుమార్ సమం చేశాడు. 2015లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తొలి ఓవర్లో స్టెయిన్ ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. గుజరాత్తో మ్యాచ్లో భువి తొలి ఓవర్లో 17 పరుగులిచ్చి ఆ చెత్త రికార్డును సమం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 36 పరుగులిచ్చిన భువనేశ్వర్ 2 వికెట్లు తీశాడు.
కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో సన్రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని సన్రైజర్స్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.