
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ చిట్టచివరి లీగ్ మ్యాచ్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. ముంబై వాంఖెడె స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్.. అనంతరం బౌలింగ్లో విఫలమైందీ జట్టు. ప్రత్యర్థికి నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోలేపోయింది. ఈ మ్యాచ్తో ఈ ఐపీఎల్ సీజన్ లీగ్ దశకు తెర పడింది. ప్లేఆఫ్స్కు చేరిన నాలుగు జట్లు తప్ప మిగిలినవన్నీ ఇప్పటికే ఇంటిదారి పట్టాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ-43 టాప్ స్కోరర్. రాహుల్ త్రిపాఠి-20, ఎయిడెన్ మార్క్రమ్-21, నికొలస్ పూరన్-5 నిరాశపరిచారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్-25, రొమారియో షెప్పర్డ్-26 సో..సో అనిపించుకున్నారు. మరో ఓపెనర్ ప్రియం గర్గ్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 47 పరుగుల భాగస్వామ్యం ఒక్కటే ఇన్నింగ్ను కాస్తయినా నిలిపింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకో 50 పరుగులైనా అలవోకగా చేసేలా కనిపించింది పంజాబ్ కింగ్స్. ఓపెనర్లు జానీ బెయిర్స్టో-23, శిఖర్ ధవన్-39 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దీన్ని విజయంగా మార్చుకుంది పంజాబ్ టీమ్. మిడిలార్డర్లో లియామ్ లివింగ్స్టోన్ మళ్లీ చెలరేగాడు. 22 బంతుల్లో అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఈ మ్యాచ్లో జానీ బెయిర్స్టో ఇచ్చిన ఓ ఈజీ క్యాచ్ను ఉమ్రాన్ మాలిక్ డ్రాప్ చేశాడు. ఇన్నింగ్ రెండో ఓవర్లోనే బెయిర్స్టో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్ అది. ఆ ఓవర్ అయిదో కాస్త వైడ్గా సంధించాడు సుందర్. ఆ ఫ్లైటెడ్ డెలివరీని బెయిర్స్టో స్వీప్ చేయడానికి ప్రయత్నించగా.. సాధ్యపడలేదు. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్మ్యాన్ దిశగా గాల్లోకి ఎగిరిందా బంతి. నేరుగా ఉమ్రాన్ మాలిక్ వైపు దూసుకెళ్లింది. దాన్ని పట్టినట్టే పట్టి డ్రాప్ చేశాడు ఉమ్రాన్.
టీమిండియాకు సెలెక్ట్ అయినట్లు తెలిసిన కొన్ని గంటల్లోనే అతను ఈ ఈజీ క్యాచ్ను డ్రాప్ చేయడం పట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అప్పటికి తొమ్మిది బంతుల్లో 20 పరుగులతో దూకుడు మీద ఉన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఇచ్చిన లైఫ్ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన వ్యక్తిగత స్కోర్కు మరో మూడు పరుగులను జోడించిన అనంతరం బెయిర్స్టో అవుట్ అయ్యాడు. మూడో ఓవర్ ఆరో బంతికి ఫజల్ ఫారూఖీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని చేసిన ఈ పరుగుల్లో అయిదు ఫోర్లు ఉన్నాయి.