ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్, న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్కు కొడుకు పుట్టాడు. ఆ పసికందు ఫొటోను కేన్, అతని భార్య సారా రహీం తమ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. లిటిల్ మ్యాన్కు స్వాగతం పలుకుతున్నామంటూ కామెంట్ జత చేశారు. సారా ఒడిలో ఉన్న ఆ పసికందుతో కూతురు మ్యాగీ ఆడుకుంటోన్న ఫొటో అది. కేన్ విలియమ్సన్-సారా దంపతులకు రెండో సంతానం. ఇదివరకే వారికి ఓ కుమార్తె ఉంది.
2019లో తొలి సంతానంగా కూతురు జన్మించింది. మ్యాగీ అని పేరు పెట్టుకున్నారా చిన్నారికి. ఇప్పుడు రెండో సంతానంగా కొడుకు పుట్టాడు. కేన్ విలియమ్సన్ దంపతులు అప్పుడే జన్మించిన తమ కుమారుడి ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఫొటో పోస్ట్ అయిన వెంటనే వైరల్గా మారింది. వందలాది మంది అభిమానులు, స్నేహితులు.. కేన్ దంపతులను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ప్రసవం కోసం సారా రహీమ్ క్రైస్ట్చర్చ్లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తరువాత- కేన్ విలియమ్సన్ స్వదేశానికి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. లీగ్స్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అతను న్యూజిలాండ్కు బయలుదేరి వెళ్లాడు. ఫలితంగా- ఆదివారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు అందుబాటులో లేడు.
అతని స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టుకు సారధ్య బాధ్యతలను తీసుకున్నాడు. కేన్ విలియమ్సన్ స్థానాన్ని ఆల్రౌండర్ రొమారియో షెప్పర్డ్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 15.1 ఓవర్లలో ఛేదించింది. 160 పరుగులు చేసింది. ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు.