
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ఎట్టకేలకు మరో విజయాన్ని అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. సెకెండ్ హాఫ్ బిగినింగ్లో మొదలైన ఈ పరాజయాల పరంపరకు చివరి దశలో తెర దించింది. ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది. ఈ నెల 22వ తేదీన పంజాబ్ కింగ్స్ను తలపడుతుంది. ఈ ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశకు అదే చిట్ట చివరి మ్యాచ్. ఆ తరువాత ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి.

వరుసగా అయిదు మ్యాచ్లను ఓడిపోయిన అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఓ విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేసింది. వాంఖెడె స్టేడియంలో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించింది. తన ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్యను 12కు పెంచుకోగలిగింది. ఇందులో నెగ్గినా సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరడానికి ఉన్న అవకాశాలు తక్కువే. మెరుగైన నెట్ రన్రేట్, తనకు పోటీ వచ్చే జట్ల పరాజయాలు సన్రైజర్స్ను ఒడ్డునపడేయగలవు.
ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తన స్కోర్ను 190 వరకూ తీసుకెళ్లగలిగింది. ఈ సీజన్ మొత్తానికీ ముంబై ఇండియన్స్ ఛాంపియన్లా ఆడిందీ మ్యాచ్లో. 194 పరుగుల టార్గెట్ను ఛేదించడానికి వీరోచితంగా పోరాడింది. చిట్టచివరి వరకూ మ్యాచ్ను తీసుకెళ్లింది. ఇంత భారీ లక్ష్యాన్ని మూడు పరుగుల తేడాతో మాత్రమే కోల్పోయిందంటే- ముంబై ఇండియన్స్ ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
తొలి వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 95 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో ఈ జట్టుకు ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ- ఫామ్లోకి వచ్చారు. రోహిత్ శర్మ-48, ఇషాన్ కిషన్-43 పరుగులు చేశారు. లక్ష్యం వైపు దూసుకెళ్తోన్న దశలో ఇషాన్ కిషన్ అవుట్ కావడం.. సన్రైజర్స్ హైదరాబాద్కు లభించిన మేజర్ బ్రేక్ త్రూ. 12వ ఓవర్ మూడో బంతికి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. అప్పటికి అతను 34 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో 43 పరుగులతో జోరుమీదున్నాడు.
ఉమ్రాన్ మాలిక్ నేరుగా స్టంప్స్ మీదికి సంధించిన ఫుల్లర్ను మిడ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు ఇషాన్. అది సరిగ్గా కనెక్ట్ కాలేదు. మిడిల్ ఆఫ్ ది బ్యాట్ టచ్ కాలేదు. ఆ పవర్ షాట్కు గాల్లోకి లేచిన బంతిని ప్రియం గర్గ్ అందుకున్న విధానం అద్భుతం. 20 గజాల దూరం పాటు వెనక్కి పరుగెత్తుతూ గాల్లోకి లేచి మరీ ఈ క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ మలుపు తిరగడానికి ప్రధాన కారణమైంది. ఇషాన్ కిషన్ అదే దూకుడును కొనసాగించివుంటే ఫలితం మరోలా ఉండేదేమోననిపించింది.