
గెలిచింది మూడే..
మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ ఖాతాలో అన్నీ అపజయాలే పడ్డాయి. ఒక్క విజయాన్ని కూడా అందుకోకుండానే ఫస్ట్ హాఫ్ను ముగించింది. సెకెండ్ హాఫ్లోనూ అదే ట్రెండ్ను కొనసాగించింది. సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్లల్లో పరాజయాలే పలకరించాయి. రాజస్థాన్ రాయల్స్పై నమోదు చేసిన విజయంతో తన ఓటములకు బ్రేక్ వేసింది. ఆ మరుసటి మ్యాచ్లోనూ గుజరాత్ టైటాన్స్పై విజయఢంకా మోగించింది. కోల్కత నైట్రైడర్స్ చేతిలో చావుదెబ్బ తిన్నతరువాత చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచి కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది.

తొలిసారి ఛాంపియన్లా..
తాజాగా వాంఖెడె స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో మట్టి కరిచింది. సీజన్ మొత్తానికి ముంబై ఇండియన్స్ కాస్తో, కూస్తో ఛాంపియన్లా ఆడిన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది.. ఇదే. 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వీరోచితంగా పోరాడింది. చిట్టచివరి వరకూ మ్యాచ్ను తీసుకెళ్లింది.. ఉత్కంఠభరితంగా మార్చివేసింది. ఇంత భారీ లక్ష్యాన్ని మూడు పరుగుల తేడాతో మాత్రమే కోల్పోయిందంటే- ముంబై ఇండియన్స్ ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డ్..
ఈ ఓటమి అనంతరం ఓ చెత్త రికార్డ్- ముంబై ఇండియన్స్ వశమైంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లు ఆడగా.. ఇందులో గెలిచింది ముచ్చటగా మూడు. ఫలితంగా ఆ జట్టు ఖాతాలో పడింది ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న 10వ స్థానం నుంచి పైకి లేస్తుందనే ఆశలు ఏ మాత్రం లేవు. తన చివరి మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొనబోతోంది ముంబై. ఈ శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఇదే వాంఖెడె స్టేడియంలో ఢిల్లీని ఢీ కొడుతుంది.

మొదటిసారిగా..
పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ఓ ఐపీఎల్ సీజన్ను ముగించడం ముంబై ఇండియన్స్కు ఇదే తొలిసారి. ఇంతకుముందెప్పుడూ ఈ స్థాయిలో పతనం కాలేదా జట్టు. 2008లో ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభమైనప్పటి నుంచి.. ఈ 15 సంవత్సరాల్లో ఫస్ట్టైమ్ ఇలాంటి దుస్థితిని చవి చూసింది. చెన్నై సూపర్ కింగ్స్ మినహా.. అన్ని జట్లు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో ముంబై కూడా చేరింది. ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే- లాస్ట్ ఇన్ ద టేబుల్గా నిలవలేదు.


Click it and Unblock the Notifications
