
బౌలర్లు విఫలం..
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 202 పరుగులు చేసింది. మొన్నటిదాకా పరుగులు చేయడానికి కష్టపడ్డ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కసారిగా విజృంభించాడు. 57 బంతుల్లో 99 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 55 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 85 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు. ఈ ఇద్దరి దెబ్బకు స్కోర్ 200లను దాటింది. మొన్నట్లాగే ఈ మ్యాచ్లోనూ బౌలర్లు విఫలం అయ్యారు. టీ నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఉమ్రాన్ మాలిక్ను ఉతికేశారు..
టీమిండియా ఫ్యూచర్ స్టార్ బౌలర్గా ఎన్నో అంచనాలను మోస్తోన్న ఉమ్రాన్ మాలిక్.. ఈ మ్యాచ్లో విఫలం అయ్యాడు. అతని బౌలింగ్లో భారీగా పరుగులు పిండుకున్నారు చెన్నై బ్యాటర్లు. ఓవర్కు సగటున 12 చొప్పున నాలుగు ఓవర్లల్లో 48 పరుగులు ఇచ్చుకున్నాడు. గుజరాత్ టైటాన్స్పై అయిదు వికెట్లు పడగొట్టిన ఈ స్పీడ్స్టర్.. ఈ మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఈ స్థాయిలో అతను ఫెయిల్ కావడం ఇదే తొలిసారి. మార్కో జెన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్దీ అదే దారి. వికెట్లను తీయలేకపోయినప్పటికీ.. భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌల్ చేశాడు.

పోరాట పటిమ..
బౌలర్లు చేతులెత్తేసిన చోట.. బ్యాటర్లు అద్బుతంగా పోరాడారు. 58 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ-39, కేప్టెన్ కేన్ విలియమ్సన్-47 పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠి విఫలం అయ్యాడు. మంచి ఫామ్లో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ సైతం భారీ స్కోర్ చేయలేకపోయాడు. అతని కాంట్రిబ్యూషన్ 17 పరుగులే. శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో ఎక్కువ సేపు నిల్చుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

త్రిపాఠి-మార్క్రమ్ మేజిక్ మిస్
టాప్-మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ జోడీ సక్సెస్ అయింది. మ్యాచ్లను గెలిపించింది కూడా. కీలకమైన ఈ హై టార్గెట్ మ్యాచ్లో ఆ మేజిక్ మిస్ అయింది. వారిద్దరూ విఫలం అయ్యారు. రాహుల్ త్రిపాఠి మరీ ఘోరం. అతనిది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ముఖేష్ చౌదరి సంధించిన లెంగ్త్ బాల్ను అర్థం చేసుకోలేకపోయాడు. షాట్ ఆడటంలో తడబడ్డాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా దూసుకెళ్లిన బంతిని సిమర్జిత్ సింగ్ అందుకున్నాడు. మార్క్రమ్ సైతం త్వరగానే అవుట్ కావడం.. జట్టు ఓటమికి దారి తీసింది.

సుందర్-శశాంక్..
వికెట్ల పతనాన్ని లోయర్ ఆర్డర్ కూడా అడ్డుకోలేకపోయింది. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్.. ఒత్తిడికి గురయ్యారు. వెంటవెంటనే అవుట్ అయ్యారు. రెండు పరుగుల తేడాతో ఈ రెండు వికెట్లు పడ్డాయి. గుజరాత్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో శశాంక్ సింగ్ భారీ షాట్లు ఆడటంతో ఈ మ్యాచ్లోనూ అతనిపై అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని తలకిందులు చేశాడు. 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అదే పరిస్థితి. అతను అవుట్ అయ్యే సమయానికి రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. పూరన్ అండగా సుందర్ నిల్చుని ఉంటే లక్ష్యాన్ని ఛేదించేవారే.

పూరన్ మెరుపులు..
సన్రైజర్స్ జట్టు స్కోర్ 189 పరుగుల వరకూ వెళ్లగలిగిందంటే అది నికొలస్ పూరన్ చలవే. దుమ్ము లేపాడు ఈ కరేబియన్ బ్యాటర్. 33 బంతుల్లో 64 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు. ఇందులో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. పూరన్ గేర్ మార్చే సమయానికే చేతులు కాలిపోయాయి. చివరి ఆరు బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో 24 పరుగులు చేయగలిగాడు. ఈ పరుగులు అత్యంత విలువైనవి. నెట్ రన్రేట్ను నిలబెట్టాయి. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది సన్రైజర్స్.


Click it and Unblock the Notifications












