
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. వరుసగా రెండో పరాజయాలతో సతమతమౌతున్న ఆ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ గాయపడ్డాడు. ఇదివరకు గాయమైన చేతికే దెబ్బ తగిలింది. దీనితో అతను జట్టుకు దూరం అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ గాయపడ్డ విషయాన్ని హెడ్ కోచ్ టామ్ మూడీ ధృవీకరించాడు. గాయం వల్ల అతను తన తరువాతి మ్యాచ్లో జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు.
సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్లో ఇది వరుసగా రెండో ఓటమిని చవి చూసింది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 203 పరుగుల టార్గెట్ను అందుకోవడంలో తడబడింది. 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 5వ తేదీన ఆడాల్సి ఉంది. ఢిల్లీ కేపిటల్స్ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉంటాడనేది అనుమానమే.

తొలి రెండు మ్యాచ్ల తరువాత ఈ ఆల్రౌండర్ జట్టుకు దూరం అయ్యాడు. ఆ రెండింట్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. ఆ తరువాత వరుసగా అయిదు మ్యాచ్లల్లో తిరుగులేని విజయాలను అందుకుంది. ఫస్ట్ హాఫ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కత నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. సెకెండ్ హాఫ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడింది.
గాయం నుంచి కోలుకున్న అనంతరం వాషింగ్టన్ సుందర్ చివరి రెండు మ్యాచ్లల్లోనూ ఆడాడు. రెండింట్లోనూ జట్టు ఓడింది. చెన్నైపై జరిగిన మ్యాచ్లో అతను బౌలింగ్ కూడా చేయలేదు. బౌలింగ్కు దూరంగా ఉన్నాడు. అతని కోటాను పార్ట్టైమ్ బౌలర్ ఎయిడెన్ మార్క్రమ్ పూర్తి చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ రెండు పరుగులే చేశాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్పైనా బౌలింగ్, బ్యాటింగ్లో రాణించలేకపోయాడు. వికెట్లేవీ కూల్చలేదు. బ్యాటింగ్లో విఫలం అయ్యాడు మూడు పరుగులే చేశాడు.
ఇప్పుడు మళ్లీ గాయపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బౌలింగ్ చేసే చేతికే మళ్లీ గాయమైందని టామ్ మూడీ చెప్పారు. బౌలింగ్ చేసే స్థితిలో లేకపోవడం వల్ల చెన్నైపై బంతిని ఇవ్వలేదని పేర్కొన్నాడు. గాయం మరింత తీవ్రమైందని చెప్పాడు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ కేపిటల్స్తో జరిగే మ్యాచ్లో అతను అందుబాటులో ఉంటాడా? లేడా? అనేది ఇప్పుడే నిర్ధారించలేమని వ్యాఖ్యానించాడు.