
ఐపీఎల్ 2022 ప్రారంభానికి సరిగ్గా మరో 20 రోజులు కూడా లేదు. ఈ సమయంలో ఫ్రాంచెజీలకు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్ల్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టు మార్చి 18 నుంచి 23వ తేదీ వరకు బంగ్లాదేశ్ జట్టుతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుండడమే దీనికి కారణం. ఇందు కోసం తాజాగా క్రికెట్ సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. ఐపీఎల్ 15లో ఆడబోతున్న 8 మంది ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించింది. దీంతో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకావశం ఉంది. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు కల్గి ఉన్న కగిసో రబడ, లుంగి ఎన్గిడి, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్, డ్వైన్ ప్రిటోరియస్, మార్కో జాన్సెన్లు బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యారు.
ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. దీంతో వన్డే సిరీస్కు ఐపీఎల్కు సఫారీ ఆటగాళ్లకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండనుంది. దీనికి తోడు భారత్లో అడుగుపెట్టాక సౌతాఫ్రికా ఆటగాళ్లు కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో వారు ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇది కాకుండా మార్చి 31 నుంచి ఏప్రిల్ 12 మధ్య సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. దీనికి ఇంకా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించలేదు. దీంతో ఐపీఎల్ ఆడనున్న ఆటగాళ్లు టెస్ట్ సిరీస్కు కూడా ఎంపికైతే లీగ్లో మరిన్ని మ్యాచ్లకు దూరం కానున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సౌతాఫ్రికా ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఐపీఎల్ ప్రాంచైజీలు తల పట్టుకుంటున్నాయి. అయితే సౌతాఫ్రికాకు ఆడాలా? ఐపీఎల్లో ఆడాలా అనే నిర్ణయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఆయా ఆటగాళ్లకే వదిలేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ మాత్రం జాతీయ జట్టుకు ఆడాలని ఆటగాళ్లను కోరాడు.
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జుబేర్ హంజా, మార్కో జాన్సెన్, జానెమన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెహ్లుక్వేయో ప్రిటోరియస్, కగిసో రబడా, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్