
వెన్ను గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 నుంచి వైదొలిగిన సౌరభ్ దూబే స్థానంలో సుశాంత్ మిశ్రాను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు అతనితో అగ్రిమెంట్పై సంతకం చేయించుకుంది. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మీడియం పేసర్ అయిన లిస్ట్ ఏ క్రికెటర్ దూబేను అతని బేస్ ప్రైస్ అయిన రూ.20లక్షలకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. అతను ఈ సీజన్లో సన్రైజర్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్లలోనూ కనిపించలేదు.
జార్ఖండ్కు చెందిన 21ఏళ్ల పేసర్ అయిన మిశ్రా వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ రూ.20లక్షలకు అతన్ని దూబే స్థానంలో తీసుకుంది. లెఫ్ట్ ఆర్మర్ అయిన మిశ్రా.. నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 4.07ఎకానమీ రేటుతో 13వికెట్లు పడగొట్టి క్రికెట్ ప్రముఖుల ఫోకస్లో పడ్డాడు. మిశ్రా ఇంతకుముందు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు రెండు సంవత్సరాలు నెట్ బౌలర్గా పని చేశాడు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ను గాయాలు వెంటాడుతున్నాయి. తుది జట్టులో ఆడే ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్లో వరుసగా రెండో సారి గాయపడడం జట్టు సమతూకాన్ని దెబ్బతీస్తోంది. అతను ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్లకు దూరమై డగౌట్లోనే కూర్చున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన గత మ్యాచ్లో బరిలోకి దిగిన సుందర్.. మళ్లీ చెన్నైతో మ్యాచ్లో మరోసారి గాయపడి జట్టుకు దూరమయ్యాడు.
గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) చెలరేగి ఆడడంతో చెన్నై తొలుత 202పరుగుల భారీ స్కోరు చేసింది. తదనంతరం బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ 6వికెట్లు కోల్పోయి 189పరుగులు మాత్రమే చేయగలిగింది.