లక్నో దూకుడుకు కళ్లెం..
మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయఢంకా మోగించింది. లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుకు కళ్లెం వేసింది. వరుసగా నాలుగో విజయంపై కన్నేసిన లక్నోకు షాక్ ఇచ్చింది. ఓ మోస్తరు పరుగులే చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోగలిగింది రాజస్థాన్. లక్నోను మూడు పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పింక్ టీమ్.. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్ల అనంతరం లక్నో ఓడిపోవడం ఇదే తొలిసారి. అయిదో స్థానంలో నిలిచిందీ కేఎల్ రాహుల్ టీమ్.

బౌలర్ల చలవ..
165 పరుగుల స్కోర్ను కాపాడుకోవటంలో.. జట్టుకు విజయాన్ని అందించడంలో రాజస్థాన్ బౌలర్ల పాత్ర కీలకం. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, జేసన్ హోల్డర్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ వంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. పైగా వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. అలాంటి జట్టుకు రాజస్థాన్ రాయల్స్ మూకుతాడు వేయగలిగిందంటే అది పూర్తిగా బౌలర్ల చలవే.
బౌల్ట్తో బోణీ..
ఇన్నింగ్ ఆరంభంలో తొలి రెండు బంతులకు రెండు వికెట్లను కోల్పోయిన తరువాత లక్నో సూపర్ జెయింట్స్ కోలుకోవడానికి చాలాసమయం పట్టింది. ఈ రెండు వికెట్లతో ట్రెంట్ బౌల్ట్ బోణీ కొట్టగా.. యజువేందర్ చాహల్ దాన్ని కొనసాగించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో నాలుగు వికెట్లను పడగొట్టాడు. భారీగానే పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
కుల్దీప్ మేజిక్..
చివరి ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ గెలవడానికి 15 పరుగులు అవసరం అయ్యాయి. పించ్ హిట్టర్ మార్కస్ స్టోయినిస్ క్రీజ్లో ఉన్నాడు. అలాంటి దశలో కొత్త కుర్రాడు కుల్దీప్ సేన్ బంతిని అందుకోవడం ఒక ఎత్తయితే.. పరుగుల ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం మరో ఎత్తు. ఈ ఓవర్లో అతను మేజిక్ చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీశాడు. అయిదు బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో ఒత్తిడికి గురి కాలేదు. 2,3,4 బంతులు డాట్స్. చివరి రెండు బంతుల్లో స్టొయినిస్ 10 పరుగుల రాబట్టుకున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచింది లక్నో.
తొలి ఐపిఎల్..
కుల్దీప్ సేన్కు ఇదే తొలి ఐపీఎల్. మెగా వేలం పాట సందర్భంగా అతణ్ని బేస్ ప్రైస్ 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. బౌలింగ్ బ్యాకప్ కోసం తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్పై తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నాలుగు ఓవర్లల్లో 35 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ధనాధన్ ఫార్మట్లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ.. చివరి ఓవర్ను సంధించే బాధ్యతను తీసుకున్నప్పటికీ.. ఎక్కడా తడబాటు ప్రదర్శించలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
బార్బర్ కొడుకు..
కుల్దీప్ సేన్ది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి రామ్పాల్ సేన్ బార్బర్. మధ్యప్రదేశ్ అతని స్వరాష్ట్రం. మధ్యప్రదేశ్ రేవాలోని సిర్మౌర్ చౌరస్తాలో ఓ చిన్న బార్బర్ షాప్ను నడుపుతున్నారు. అయిదుమంది సంతానంలో కుల్దీప్ సేన్ మూడో వాడు. స్థానిక వింధ్య క్రికెట్ అకాడమీలో అతను తన క్రికెట్ కేరీర్ను ఆరంభించాడు. నాలుగేళ్ల కిందట మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటాడు. దీనితో అతణ్ని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంది.


Click it and Unblock the Notifications
