
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో ఓటమిని అందుకుంది. సోమవారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఓడింది. ఈ టోర్నమెంట్లో ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు- ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లల్లో సంజు శాంసన్ సారథ్యంలోని ఈ జట్టు ఆరింట్లో నెగ్గింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన థ్రో- బౌలర్ ట్రెంట్ బౌల్ట్ను తాకింది. వికెట్ కీపర్ ఎండ్ వైపు బంతిని విసరగా అది నేరుగా వెళ్లి బౌల్ట్ను తాకింది. బంతి తన వైపు దూసుకొస్తోండటాన్ని చూసి.. బౌల్ట్ తప్పించుకునే ప్రయత్నం చేసినా కుదర్లేదు. అది అతని పాదాన్ని తాకింది. ఈ ఘటన పట్ల ఫీల్డర్లు ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు.
ఇన్నింగ్ మూడో ఓవర్ తొలిబంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రెంట్ బౌల్ట్ ఆ ఓవర్ను సంధించాడు. ఆ బంతిని ఎదుర్కొన్న బాబా ఇంద్రజిత్.. దాన్ని మిడాన్ దిశగా ఆడాడు. రన్ కోసం పరుగెత్తాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న ప్రసిద్ధ్ కృష్ణ.. బంతిని అందుకుని వికెట్ కీపర్ ఎండ్ వైపు విసిరాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి ఆరోన్ ఫించ్ను అటు వెళ్లేలోగా వికెట్లను గిరాటేసేలా దాన్ని సంధించాడు. వికెట్లకు, ప్రసిద్ధ్ కృష్ణకు మధ్యలో నిల్చున్న ట్రెంట్ బౌల్ట్ వైపు దూసుకెళ్లిందా థ్రో.
దీన్ని చూసిన బౌల్ట్- ఆ బంతి నుంచి తప్పించుకోవడానికి మెరుపులా గాల్లోకి ఎగిరాడు గానీ ఫలితం లేకుండా పోయింది. నేరుగా అతి అతని కుడి పాదాన్ని తాకింది. గాల్లోకి ఎగిరిన బౌల్ట్ అదుపు కోల్పోయి కిందపడిపోయాడు. దీనితో ప్రసిద్ధ్ కృష్ణ బిత్తరపోయాడు. బిక్కమొహం వేశాడు. జోస్ బట్లర్.. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకున్నాడు. మరో ఫీల్డర్ షిమ్రోన్ హెట్మెయిర్.. నవ్వాలో ఏడ్వాలో తెలీని స్థితిలో కనిపించాడు. కేప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ సంజు శాంసన్ మాత్రం అసహనాన్ని వ్యక్తం చేశాడు.