|
200 ప్లస్..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. మరోసారి జట్టు స్కోరును 200లను దాటించింది. రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ ఎప్పట్లాగే- తనకు బాగా అలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. వరుసగా రెండో సెంచరీ బాది అవతల పడేశాడు. 65 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ కూడా విజృంభించడంతో స్కోర్ 222కు చేరింది.
|
చివరి వరకూ పోరాడిన ఢిల్లీ..
భారీ స్కోర్ నుంచి భయపడలేదు ఢిల్లీ కేపిటల్స్. చివరి వరకూ పోరాడింది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, కేప్టెన్ రిషభ్ పంత్, లలిత్ యాదవ్, లోయర్ ఆర్డర్లో రౌమన్ పావెల్.. పట్టు వదల్లేదు. చివరి బంతి వరకూ పోరాడారు. అయినప్పటికీ.. అది సరిపోలేదు. 207 పరుగుల వద్దే నిలిచిపోయింది ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం. 15 పరుగుల తేడా ఓడిపోయింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్.. మళ్లీ పైకెక్కి కూర్చుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
|
చివరి ఓవర్లో హైడ్రామా..
ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆరు బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో రౌమన్ పావెల్ ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మెక్ కాయ్ వేసిన ఆ ఓవర్లో తొలి మూడు బంతులను ఫెన్సింగ్ దాటించాడు. దీనితో ఒక్కసారిగా మ్యాచ్ ఢిల్లీ వైపునకు మొగ్గేలా కనిపించింది. ఈక్వేషన్స్ మారిపోయాయి. ఆ దశలో నాలుగో బంతిని స్లోయర్ డెలివరీగా సంధించాడు మెక్. ఆ బంతికి పరుగులు రాలేదు గానీ వివాదం చెలరేగింది.
|
నో బాల్ కోసం పట్టు..
నడుం కంటే ఎత్తుకు బంతి దూసుకెళ్లినందున ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ దాన్ని నో బాల్గా ప్రకటిస్తాడని భావించారు. అలా జరక్కపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అది నోబాల్ అని.. ఛాతీ మీదికి బంతి దూసుకొచ్చిందంటూ పావెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్తో వాదించాడు. అంపైర్ దీనికి అంగీకరించకపోవడంతో డగౌట్లో ఉన్న రిషబ్ పంత్ అసహనానికి గురయ్యాడు. ఇంకా బంతులు మిగిలి ఉన్నప్పటికీ.. వెనక్కి వచ్చేయండంటూ చేతులు ఊపాడు.
|
మెడపట్టి గెంటిన యుజీ
ఆ సమయంలో పావెల్తో పాటు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కుల్దీప్ చాహల్.. పిచ్ను వదలి వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించగా.. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేందర్ చాహల్ అడ్డుకున్నాడు. ఎక్కడికెళ్తావ్ బే అంటూ అడ్డుపడ్డాడు. తప్పించుకుని వెళ్లడానికి ప్రయత్నించగా.. అతని మెడ పట్టుకుని పిచ్ మీదికి గెంటేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నో బాల్ వ్యవహారం అనంతరం మ్యాచ్లో చోటు చేసుకున్న పరిణామాలు రిషభ్ పంత్ను వివాదాస్పదుడిని చేశాయి. రీకాల్తో తప్పు చేశాడనే అభిప్రాయాలుు ఉన్నాయి.