
లేత ఆకుపచ్చ.. కలిసి రావట్లే..
ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు వచ్చిన సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. తన జెర్సీని మార్చింది. ఇదివరకు రెండ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కాకుండా.. లేత పచ్చరంగు జెర్సీతో కనిపించనుంది. లేత ఆకుపచ్చ కలర్తో డిజైన్ చేసిన జెర్సీని ధరించబోతున్నారు ఆ జట్టు ప్లేయర్లు. దీనితోనే ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీ ఆడబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది.

ఉద్దేశం మంచిదే అయినా..
పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకున్నట్లు తెలిపింది గానీ దాని వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదని ఐపీఎల్ హిస్టరీ స్పష్టం చేస్తోంది. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. అది ఆర్సీబీకి అచ్చి రావట్లేదు. నిజానికి- ఈ రంగు జెర్సీని ధరించడం ఆర్సీబీకి కొత్తేమీ కాదు. 2011 సీజన్ నుంచీ దీన్ని పాటిస్తూ వస్తోంది. ఇప్పుడూ దాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా 10 సీజన్లల్లో గ్రీన్ కలర్ జెర్సీని ధరించి ఆడిన తొలి మ్యాచ్లల్లో ఏడింట్లో ఓటమిపాలైంది ఆర్సీబీ.

ఆ మ్యాచ్లో వీరవిహారం..
2011లో గ్రీన్ జెర్సీని ధరించి ఆడిన తొలి మ్యాచ్లో గెలిచింది. ఆ తరువాత విజయాలు ముఖం చాటేశాయి. 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020లల్లో ఓడిపోయింది. 2015లో ఈ కలర్ జెర్సీలో ఆడిన మ్యాచ్లో ఫలితం తేలలేదు. 2016 సీజన్ మ్యాచ్ను తన ఖాతాలో వేసుకోగలిగిందంతే. 2011లో కోచి టస్కర్స్ కేరళ, 2016 గుజరాత్ లయన్స్పై విజయం సాధించింది. 2016 నాటి మ్యాచ్ మాత్రం ఆర్సీబీ చిరస్మరణీయం. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సెంచరీలు బాదేశారు. తన ప్రత్యర్థిని 144 పరుగుల తేడాతో ఓడించారు.

ట్రెడీషన్ కంటిన్యూ అవుతుందా? లేక..
ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా? లేక చరిత్రను తిరగరాస్తుందా? అనేది ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్తో తేలిపోతుంది. ఇది ఒకరకంగా సన్రైజర్స్ హైదరాబాద్కు కలిసి వస్తుందనే భావించాల్సి ఉంటుంది. గ్రీన్ కలర్ జెర్సీని ధరించి ఆడిన మ్యాచ్లో ఓడినవే అధికంగా ఉన్నందున- అదే ట్రెడీషన్ కొనసాగితే మాత్రం సన్రైజర్స్ పంట పండినట్టే అవుతుంది. ఈ రకంగా వచ్చిన అవకాశాన్ని సన్రైజర్స్ సద్వినియోగం చేసుకుంటుందా? లేక 2016 తరహాలో విరాట్ కోహ్లీ మళ్లీ విజృంభిస్తాడా అనేది ఆసక్తికరం.


Click it and Unblock the Notifications
