
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్పై ఆ జట్టు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలాగా కార్తీక్ కూడా ప్రశాంతంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. జట్టుకు అవసరమైనప్పుడు కార్తీక్ అండగా ఉండి, గొప్పగా రాణిస్తున్నాడని కొనియాడాడు. కీలక సమయంలో పరుగులు చేస్తున్నాడని డుప్లిసెస్ అన్నాడు. కాగా ఐపీఎల్లో ఫాఫ్ డిప్లిసెస్ గతంలో మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై సాధించిన విజయంతో తాను సంతోషంగా ఉన్నట్లు డుప్లిసెస్ తెలిపాడు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో తమ జట్టు పాజిటివ్గా ఆడడానికి ప్రయత్నించిందని చెప్పాడు. అయితే కోల్కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని డుప్లిసెస్ కొనియాడాడు.
ఈ మ్యాచ్లో లక్ష్యం తక్కువగా ఉన్నప్పటికీ వికెట్లు కాపాడుకోవాల్సి వచ్చిందని ఫాఫ్ డుప్లిసెస్ చెప్పాడు. బంతి స్వింగ్తోపాటు బౌన్సు కూడా అవడంతో పరుగులు రావడం కష్టమైందన్నాడు. మూడు రోజుల క్రితం ఇదే పిచ్పై జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేస్తే.. ఈ సారి మాత్రం 130 వరకే చేశాయని గుర్తు చేశాడు. తమ టీంలో చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారని చెప్పిన డుప్లిసెస్ ఏదైనా అవసరమైతే వారి సాయం తీసుకుంటానని తెలిపాడు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అంతా కలిసి కట్టుగా జట్టుగా ఉన్నామని చెప్పాడు. తమ జట్టులోని కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని, వారికి ఏదైనా ఆలోచన వస్తే తనతో పంచుకుంటున్నారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ తెలిపాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే లో స్కోరింగ్ మ్యాచ్లో కోల్కతానైట్ రైడర్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 128 పరుగులకే ఆటౌటైంది. 129 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లలోని ఏ ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగుల మార్క్ను అందుకోకపోవడం గమనార్హం. మొత్తంగా బౌలర్లు అధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో 4 వికెట్లతో చెలరేగిన ఆర్సీబీ స్పిన్నర్ హసరంగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.