
ఐపీఎల్-2022లో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీ 21పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (54బంతుల్లో 92పరుగులతో) రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. వార్నర్ ఈ మ్యాచ్లో కడదాకా క్రీజులో నిలిచి నాటౌట్గా నిలిచాడు. ఇక వార్నర్ ఇన్సింగ్స్ పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు తమ జట్టు తరఫున అత్యుత్తమ ఇన్నింగ్స్లలో వార్నర్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఒకటని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ పంత్ మాట్లాడుతూ.. మా జట్టు ఎప్పుడూ మెరుగుదల కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం మా బ్యాటింగ్ యూనిట్ సరైన ఫామ్, సమతూకంతో ఉంది. నేను ఈ మ్యాచ్ పరంగా ప్రశాంతంగా ఉన్నాను. హై స్కోరింగ్ ఛేజింగ్లో ఇతర జట్టుకు ఓవర్కు 10-12పరుగులు అవసరమవుతాయి. 20వ ఓవర్ వరకు హిట్టింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం కష్టం. ఇదే విషయాన్ని మా బౌలర్లకు చెప్పి ప్రశాంతంగా ఉండాలని చెప్పాను. ఎలాంటి ఒత్తిడిని దరిచేరనీయొద్దన్నాను. ఇక తొలి ఇన్నింగ్స్లో వార్నర్ బ్యాటింగ్ చేసిన విధానం, అతను ఇన్నింగ్స్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఇది మా జట్టు అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి. రోవ్మాన్ పావెల్ తన బ్యాటింగ్ ద్వారా ఏం చేయగలడో మాకు తెలుసు. తొలి మ్యాచ్లలో అతను విఫలమైనా మేము అతనికి సపోర్ట్ ఇచ్చాం. అతను ఇప్పుడు అద్భుతంగా తన బ్యాటింగ్ సత్తాను చూపుతున్నాడు. మేము తర్వాత ఆడబోయే మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఆ మ్యాచ్లో 100శాతం మా ఎఫెర్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తాం.' అని పంత్ పేర్కొన్నాడు.


ఇక ఎస్ఆర్హెచ్పై విజయం సాధించడం మాపై ఒత్తిడిని తగ్గించిందన్న పంత్.. రాబోయే మ్యాచ్లలోనూ రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా హైదరాబాద్పై విజయంతో 10పాయింట్లతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ కంటే ఒక స్థానం ముందుకెళ్లి ఐదో స్థానానికి ఢిల్లీ చేరింది. ఢిల్లీ నెట్ రన్ రేట్ సైతం బాగా మెరుగుపడింది. ఇక ప్రస్తుతం ఆ జట్టు పూర్తి సమతూకంతో కన్పిస్తుండడంతో ప్లేఆఫ్ రేసులో ముందుండే అవకాశముంది.