
విరాట్ చుట్టూ విమర్శలు..
ఈ వరుస పరాజయాలు అటు విరాట్ కోహ్లీ ఫామ్ను కూడా ఎత్తి చూపుతున్నాయి. అతని బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా వివాదాలకు కేంద్రబిందువైంది. వన్డౌన్లో వచ్చే విరాట్ కోహ్లీ- రాజస్థాన్పై మ్యాచ్లో ఓపెనర్గా బరిలో దిగాడు. అనూజ్ రావత్ స్థానంలో బ్యాట్ అందుకున్నాడు. కేప్టెన్ ఫాప్ డుప్లెసిస్తో కలిసి ఇన్నింగ్ ఆరంభించాడు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు కింగ్ కోహ్లీ. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్లో తొలి వికెట్ విరాట్ కోహ్లీదే. ఆ తరువాత ఛాలెంజర్స్ బ్యాటింగ్ తడబడింది. వరుసగా వికెట్లు పడ్డాయి. 115 పరుగులకు కుప్పకూలింది.

కోహ్లీ మళ్లీ మళ్లీ..
బ్యాటింగ్ కింగ్ కోహ్లీ ఫామ్ను అందిపుచ్చుకోవట్లేదు. టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ అతను బలహీనపడుతున్నాడు. ఫామ్ను కోల్పోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్లల్లో గోల్డెన్ డకౌట్ కావడం.. అతని బ్యాటింగ్ పతనావస్థకు అద్దం పడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని ఘోరంగా దెబ్బ తీస్తోంది. విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. తొలి గోల్డెన్ డక్ సమయంలోనే ఈ డిమాండ్ వినిపించింది. అది ఇప్పుడు పీక్స్కు చేరింది.

టీ20 జట్టు నుంచి తప్పిస్తుందా?
ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి అందిన లీక్.. అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరును బీసీసీఐ నిశితంగా గమనిస్తోందని, టీ20 జట్టు నుంచి తప్పించేలా పావులు కదుపుతోందని తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు సైతం ఈ వార్తను ధృవీకరించాయనే ప్రచారం సాగుతోంది. విరాట్ కోహ్లీ మళ్లీ మునుపటి ఫామ్ను అందిపుచ్చుకోవడం.. ఇదివరకట్లా బ్యాటింగ్లో ఫైర్ను చూపించగలిగితేనే అతని పేరును పరిగనణలోకి తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్
జూన్లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. దీని తరువాత ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీమిండియా సిరీస్లను ఆడాల్సి ఉంది.


ఆ సిరీస్ నుంచి అవుట్..?
కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంపిక చేసే టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేయకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇది అనధికారమే అయినప్పటికీ- కోహ్లీ ఇప్పుడున్న ఫామ్ను చూస్తోంటే.. అది వాస్తవ రూపం దాల్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోహ్లీకి ప్రస్తుతం విశ్రాంతి చాలా అవసరమని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు స్పష్టం చేస్తోన్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్కు అతనికి విశ్రాంతిని కల్పించిన అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేయొచ్చని అంటున్నాయి.


Click it and Unblock the Notifications
