

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో ఇది రెండో విక్టరీ. ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లోనూ తిరుగులేని విజయాలను నమోదు చేసిన రాజస్థాన్ను మట్టి కరిపించింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న దశ నుంచి విజయం వైపు ప్రయాణించిన తీరు ఆ జట్టు సత్తాను చాటింది.
ప్రత్యేకించి.. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ ద్వయం సంజు శాంసన్ టీమ్ నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. 87 పరుగులకు సగం వికెట్లను కోల్పోయి- ఓటమి అంచుల్లో ఉన్న దశలో రాయల్ ఛాలెంజర్స్.. రాయల్గా రాణించింది. ఆ జట్టు నిలదొక్కుకుని- విజయం వైపు సాగించిన ప్రయాణం ఓ అద్భుతమే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటం మాత్రమే కాకుండా- రన్రేట్ను పరుగులు పెట్టించారు. జట్టు విజయం సాధించడానికి అవసరమైన రన్రేట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం దినేష్ కార్తీక్ భావోద్వేగంతో మాట్లాడాడు. తన ప్రయాణం ఇంకా ముగియలేదని, సాధించాల్సింది చాలా ఉందని చెప్పాడు. తాను నిర్దేశించుకున్న లక్ష్యం ఇంకా చాలా దూరం ఉందని, దీన్ని అందుకోవడానికి తనను తాను తీర్చిదిద్దుకున్నానని అన్నాడు. ఈ క్రమంలో కఠోరంగా శ్రమించాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించాడు. ఒక్కో ఓవర్కు 12 పరుగులు చేయాల్సి ఉందనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకుని ఆడానని చెప్పాడు. ముందుగా అనుకున్న ప్రణాళికలను పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగానని దినేష్ కార్తీక్ స్పష్టం చేశాడు.
ఇదివరకు కోల్కత నైట్ రైడర్స్కు కేప్టెన్గా వ్యవహరించిన అనుభవం దినేష్ కార్తిక్కు ఈ మ్యాచ్లో కలిసొచ్చింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. 87 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్లోకి వచ్చిన అతను షాబాజ్ అహ్మద్తో కలిసి ఇన్నింగ్ను పునర్నిర్మించాడు. ఎంత వేగంగా తన జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందో.. అంతే వేగంతో దాన్ని గాడిన పెట్టాడు. ఒత్తిళ్ల మధ్య.. వికెట్ పడకుండా.. భారీ షాట్లను ఆడటం అంటే మాటలు కాదు. అలాంటి గడ్డు పరిస్థితిని అధిరోహించగలిగాడు.