
విరాట్ ఫెయిల్యూర్
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చినప్పటికీ.. పెద్దగా ఫలితం కనిపించలేదు. సాధారణంగా వన్డౌన్లో వచ్చే విరాట్ కోహ్లీ- రాజస్థాన్పై మ్యాచ్లో ఓపెనర్గా బరిలో దిగాడు. అనూజ్ రావత్కు బదులుగా కేప్టెన్ ఫాప్ డుప్లెసిస్తో కలిసి జట్టు ఇన్నింగ్ను ఆరంభించాడు.
ఈ ప్రయోగం బెడిసికొట్టింది. మళ్లీ విఫలం అయ్యాడు. మరోసారి గోల్డెన్ డక్ను ఎదుర్కొనబోయి తృటిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోలేదు. తొమ్మిది పరుగులే చేసి వెనుదిరిగాడు.

కోహ్లీ ఫామ్ పట్ల మాజీల ఆందోళన..
బ్యాటింగ్ కింగ్ కోహ్లీ ఫామ్ను అందిపుచ్చుకోవట్లేదు. చివరి అయిదు మ్యాచ్లల్లో అతను చేసింది 22 పరుగులే. ఇందులో రెండు గోల్డెన్ డకౌట్స్ ఉన్నాయి. చివరి అయిదింట్లో 1, 12, 0, 0, 9 పరుగులు చేశాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఈ డిజిట్స్ కోహ్లీ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. ఈ పరిణామాలు అటు విరాట్ కోహ్లీనే కాదు.. అతని అభిమానులను కూడా తీవ్ర నిరాశ, ఆవేదనకు గురి చేస్తోన్నాయి. మాజీ క్రికెటర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

తప్పించడమే బెటర్..
ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని తుదిజట్టు నుంచి తప్పించడమే మంచిదని సూచించాడు. కోహ్లీకి విశ్రాంతి కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. కోహ్లీకి ప్రస్తుతం విశ్రాంతి అవసరమని, సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన అతను అలసిపోయాడనీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కోహ్లీకి విశ్రాంతి కల్పించడం వల్ల అతను మళ్లీ రిథమ్లోకి రాగలుగుతాడని, అది జట్టుకే మంచిదని చెప్పాడు.


Click it and Unblock the Notifications













